జగన్ సర్కార్కు మళ్లీ ఎదురుదెబ్బ: విచారణ చేపట్టిన నిమిషాల్లోనే: సుప్రీం తీర్పు కాపీ ఇదే..!
అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే దాన్ని కొట్టేసింది. ఎన్నికలను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు తమ విధుల్లో పాల్గొనకుండా ఇలా పిటిషన్లను దాఖలు చేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
ప్రభుత్వ తరఫు న్యాయవాదితో ఏకీభవించని బెంచ్..
పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్పై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేష్ రాయ్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇదివరకు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఎన్నికలపై స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు, వ్యక్తులకు న్యాయస్థానాలు చెప్పాలా?
సింగిల్ జడ్జి తీర్పును పరిగణనలోకి తీసుకోవట్లేదని సంజయ్ కౌల్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్దమైన వ్యక్తులు ఏం చేయాలో న్యాయస్థానాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం రాజ్యాంగానికి లోబడే ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేసిందని, పంచాయతీ పోలింగ్ నిర్వహణ షెడ్యూల్ను ప్రకటిచిందని పేర్కొన్నారు. ఏదో వంకతో ఎన్నికలను వాయిదా వేయించాలని చూడటం సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న తొలి రోజుల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గుర్తు చేశారు.
ఎన్నిసార్లు వాయిదా వేస్తారు?.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రతిసారీ వాయిదా పడుతూ వస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని జస్టిస్ సంజయ్ కౌల్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్..ఈ రెండు వ్యవస్థల తాము తలదూర్చ దలచుకోలేదని ఘాటుగా స్పందించినట్లు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ ప్రక్రియలో ఒక భాగమని, దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని ఉద్యోగం సంఘాలపై సుప్రీంకోర్టు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఎన్నికలను నిర్వహించని తప్పనిసరి పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది.
తీర్పు కాపీ చూసిన తరువాతే..
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఇంకా చూడలేదని, దాన్ని చూసిన తరువాతే స్పందిస్తానని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తాము ఘన విజయాన్ని సాధిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ పూర్తిగా చదివాక కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఉద్యోగస్తుల ప్రాణాలు తాము పణంగా పెట్టలేమని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.