మహానాడు వేళ టీడీపీకి భారీ షాక్: ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్: జగన్ తో భేటీ..ముహూర్తం ఖరారు..!
అమరావతి: ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి భారీ జలక్. పార్టీ ఆవిర్భావ వేడుకలు మహానాడు సమయంలోనే వైసీపీ వ్యూహాత్మకంగా దెబ్బ తీసే ఎత్తుగడలకు తెర లేపింది. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ తో భేటీ అయి అనధికారికంగా వైసీపీకి అనుబంధంగా ఉన్నారు. ఇక, తాజాగా మరో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే బాట పట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక మంత్రి వద్ద వారు భేటీ అయ్యారు.
ఈ సాయంత్రం సీఎం జగన్ తో వారు సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా గురువారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం సీఎంతో సమావేశమ్యేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా నేరుగా వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండానే..టీడీపీని దెబ్బ తీయటానికి వైసీపీ తమ ఎత్తుగడలను కొనసాగిస్తోంది. ఇప్పుడు వారిని పార్టీ వీడకుండా కాపాడుకొనేం దుకు టీడీపీ అధినాయకత్వం చివరి ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
సీఎంతో భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్దం..
2019 ఎన్నికల్లో టీడీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని బాలశౌరి.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్...చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సీఎంతో భేటీ అయ్యారు. వారు పార్టీ మారుతున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా..సీఎం నిర్ణయాలకు మద్దతుగా నిలిచారు.
ఇక, ఇప్పుడు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ సాయంత్రం ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సత్యప్రసాద్ సైతం వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. సత్యప్రసాద్ సోదరి డాక్టర్ కావటం...జగన్ సతీమణికి స్నేహితురాలు కావటంతో ఆ పరిచయాల ద్వారా సత్యప్రసాద్ వైసీపీలోకి వస్తున్నట్లుగా సమాచారం. ఇక, ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సైతం సొంత జిల్లాకు చెందిన మంత్రి బాలినేని తో మంతనాలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లిలో సీఎం జగన్ ను కలిసి తమ మద్దతు తెలపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరు సైతం అనధికారికంగా వైసీపీతో ఆ ముగ్గురి తరహాలోనే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రెండు రోజుల్లో మరో అయిదుగురు..
ఇక, ప్రకాశం జిల్లాకు చెందిన మరో యువ ఎమ్మెల్యే సైతం టీడీపీకి దూరం అవ్వాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి వెళ్లి..2019 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ఆ యువ ఎమ్మెల్యే తిరిగి వైసీపీకి అనుబంధంగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఆయనకు సంబంధించిన వ్యాపారాల పైన ఉన్న ఒత్తిళ్ల కారణంగా ఆయన టీడీపీని వీడటం ఖాయమని చెప్పుకొచ్చినా..ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం ఇదే బాట పట్టినట్లు తెలుస్తోంది.
ఆయనతో వైసీపీలో కీలక స్థానంలో ఉన్న నేత సంప్రదింపులు పూర్తయినట్లు చెబుతున్నారు. బుధ లేదా గురువారం ప్రకాశం జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యేతో పాటుగా తూర్పు గోదావరికి చెందిన మరో ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అవ్వటం ఖాయమని వైసీపీి నేతలు చెబుతున్నారు. ఇక, విశాఖ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం ఎప్పటి నుండో టీడీపీ వీడటం ఖాయమని ప్రచారం సాగుతుండగా..అందులో ఇద్దరు ముందుకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, ప్రకాశం లో మిగిలిన ఏకైక ఎమ్మెల్యే సైతం ఈ రోజు లేదా రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Recommended Video
ఏడుగుురు ఎమ్మెల్యేల జంప్..టీడీపీక్ షాక్
పార్టీ ఆవిర్భావ వేడుకలతో మహానాడు నిర్వహణ లో బిజీగా ఉన్న పార్టీ అధినాయకత్వాన్ని వైసీపీ సమయం చూసి దెబ్బ కొడుతోంది. అందులో భాగంగా..మహానాడు సమయంలోనే ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల ను తమ వైపు తిప్పుకొనే ఎత్తుగడలను వేగవంతం చేసింది. ఈ రోజు నుండి వచ్చే మూడు రోజుల్లో మొత్తంగా ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలుస్తారని చెబుతున్నారు.
విశాఖ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు మినహా మిగిలిన ముగ్గురు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రకాశం జిల్లాలో నలుగుర ఎమ్మెల్యేలుగా గెలవగా..ఇప్పుడు ఆ జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ నగరంలోనూ అదే పరిస్థితి. ఈ నెల 28 లోగా ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన కలవటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా పార్టీ నేతల సమాచారం. దీంతో.. టీడీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది పార్టీ నుండి దూరం అవుతన్నట్లుగానే కనిపిస్తోంది. మరి కొంత మంది పైన ఫోకస్ చేసిన వైసీపీ అందులో సక్సెస్ అవుతే ఇక చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదు. దీంతో రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.