జగన్ ప్రభుత్వానికి వరుస షాక్లు: కార్యాలయాల తరలింపుకు బ్రేక్: జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు ..!
వరుసగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు న్యాయ పరంగా చుక్కెదురైంది. ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ జీవోల జారీ విషయంలోనూ వివాదం నెలకొని ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి సమాచారం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇక, ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. ప్రభుత్వం నుండి సమాధానం వచ్చిన తరువాత హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం: నిమ్మగడ్డ లేఖపై సీబీఐ విచారణ: కేంద్రానికి సిఫార్సు...!
బిల్లులు ఆమోదం లేకుండానే..
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ ఆదేశించారు. దీని పైన రాజకీయంగా వివాదం నెలకొని ఉంది. ఇప్పటి వరకు కమటీల ఏర్పాటు సైతం జరగలేదు. దీంతో..నాలుగు నెలల సమయం తరువాత ఇక సెలెక్ట్ కమిటీకి వెళ్లాల్సిన అవసరం లేదని..సాంకేతికంగా ఆ బిల్లులు ఆమోదం పొందినట్లేనని ఏపీ ప్రభుత్వ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. అయితే, టీడీపీ మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్నూలుకు న్యాయ పరమైన విభాగాల తరలింపుకు ఇచ్చిన ఉత్తర్వుల పైన హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.
సరిపోకుంటే పక్క భవనాల్లోకి మార్చుకోవచ్చంటూ
దీని పైన ప్రభుత్వ వివరణ కోరగా.. స్థలం సమస్యగ కారణంగానే కర్నూలుకు మారుస్తున్నామని వివరణ ఇచ్చింది. అయితే, స్థలం సరిపోకుంటే పక్క భవనాల్లోకి మార్చుకోవచ్చంటూ సూచించింది. అయితే, కర్నూలులో ఏపీ విజిలెన్స్ కమిషనర్, పీఆర్సీ కమిషనర్ తో పాటు మరో 10 విభాగాల తరలింపుపై ప్రతిపాదనలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. సచివాలయంతో సంబంధం లేని ఈ కార్యాలయాలకు 11 వేల చదరపు అడుగుల స్థలం అవసరం ఉందని గుర్తించామని అందుకే తరలింపు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వివరణ ఇచ్చింది.
ఉత్తర్వులు సస్పెన్షన్..ప్రభుత్వానికి చుక్కెదురు
ప్రభుత్వ నిర్ణయాల అమలకు వరుస బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులకు మండలిలో అడ్డు తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా కారణంగా ఎన్నికల సంఘం ఆరు వారాలు ఎన్నికలను నిలుపుదల చేసారు. ఇదే అంశం పైన సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడ ప్రతికూల ఫలితం వచ్చింది. అయితే, కొంత వెసులుబాటు మాత్రం కలిగింది. ఇక, ఇప్పుడు కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే
ఇక, ఈ కేసు తేలకుండా ఇతర కార్యాలయాల తరలింపు పైన ప్రభుత్వ నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపించటం లేదు. ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే మూడు రాజధానుల వివాదానికి ముగింపు పలికి..విశాఖ నుండి పరిపాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ముహూర్తం సైతం ఖరారు చేసింది. అయితే, ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వ ఆలోచనలకు బ్రేక్ పడింది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఏరకమైన అడుగులు వేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.