పవన్కు ఆశాభంగం! ప్రధానితో జగన్ భేటీ వెనుక: వేగంగా మారుతున్న సమీకరణాలు
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత నెలలో బీజేపీ..జనసేన మధ్య పొత్తు పొడిచింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే బీజేపీకి దూరమైంది. ఆ తరువాత ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వైసీపీ కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలి సారి తనను కలిసిన సమయంలో జగన్ ను ప్రధాని అభినందించిన తీరు చూసిన వారికి కూడా వారిద్దరి లక్ష్యం ఏంటనేది స్పష్టమైంది. అయితే, ఇది జరిగి ఆరు నెలలు కూడా కాకుండానే ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.
పవన్ కళ్యాణ్కు బీజేపీ షాకిస్తోందా..?
వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జనసేన-బీజేపీలు కలిసి పోరాటం చేస్తాయని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం నిర్వహించలేదు. అమరావతి పైన కార్యాచరణ డిసైడ్ కాలేదు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేతకు ప్రధాని..అమిత్ షా అప్పాయింట్మెంట్ లభించలేదు . మూడు నెలలుగా ఏపీ సీఎం జగన్కు కూడా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. కానీ, ఉన్నఫలంగా ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు వెళ్లారు.. పవన్ కు నో అన్న పీఎంఓ ఇప్పుడు జగన్ కు ఎస్ అంది. పొత్తు కుదిరిన తరువాత కూడా పవన్ కు వారి నుండి ఆహ్వానం లేదు. ఇక, ఇప్పుడు ఏపీలో కొత్త సమీకరణాల పైన ఢిల్లీలో జోరుగా ప్రచారం మొదలైంది.
జగన్ మదిలో ఏముంది..? పవన్కు బీజేపీ సహకరించడం లేదా..?
జనసేనానితో పొత్తు పెట్టుకోవడం ద్వారా వైసీపీపైన ఒత్తిడి తీసుకురావచ్చని బీజేపీ భావించింది. ఆ మేరకు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంది. తాజాగా మారుతున్న సమీకరణాలతో పవన్ చంద్రబాబులు బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇవ్వకూడదనే నిర్ణయానికి సీఎం జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కు బీజేపీ నేతలు సహకరిచడం లేదనే వార్త ఇరు పార్టీ వర్గాల్లో షికారు చేస్తోంది. కలిసి పోరాటం, ప్రకటనలే కానీ ఎక్కడా కార్యాచరణ కనిపించడం లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదనే భావన బీజేపీ పెద్దల్లో ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్తో పెద్దగా కలిసొచ్చేది లేదనే భావనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు ఢిల్లీలో వార్త చక్కర్లు కొడుతోంది.
కేంద్ర కేబినెట్లోకి వైసీపీ..?
ఇక తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనక ఓ పెద్ద కార్యమే ఉన్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలో జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్కు ఢిల్లీ నుంచి పిలుపు రావడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్లోకి వైసీపీ చేరబోతోందనంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పవన్తో పొత్తు పెట్టుకుని వైసీపీని కేంద్ర కేబినెట్లోకి ఎలా తీసుకుంటారనే సందేహం కూడా మరోవైపు వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్కు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసేన పునరాలోచనలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు అనలిస్టులు.
రాజ్యసభపై ఫోకస్ చేసిన బీజేపీ..అందుకే..!
ఇక కేంద్ర కేబినెట్లో చేరాలని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే సీఎం జగన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హోదా అంశంపైన మార్గం చూపిస్తే కేబినెట్లో చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్లు సమాచారం. సీఎం జగన్ అభ్యర్థనను పరిశీలిస్తామని కేంద్రం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక పలు కీలక బిల్లులు పాస్ చేయించేందుకు రాజ్యసభలో బీజేపీకి తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో పలుమార్లు ఇబ్బందులకు గురైంది. దీంతో రాజ్యసభ పై కమలనాథులు ఫోకస్ చేశారు. వచ్చే ఏప్రిల్లో వైసీపీకి నాలుగు రాజ్యసభ సీట్లు వస్తాయి. ఇప్పటికే రెండు సీట్లు ఉండటంతో మొత్తం సంఖ్య ఆరుకు చేరుకుంటుందని కమలనాథులు లెక్కలేసుకున్నారు.
ఇక ఏపీకి కూడా ప్రభుత్వపరంగానూ కేంద్రం సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే చాలా అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానితో దాదాపు రెండుగంటల పాటు జగన్ సమావేశం కానున్నారు. ఇక్కడే ప్రతి అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెలరోజుల్లో ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయ సమీకరణాల్లో వేగంగా మార్పులు జరుగుతాయని సమాచారం.