వైసీపీలో కలకలం.. అమరావతి రైతులకు ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం.. మందడంలో మంతనాలు
Recommended Video
మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ పట్టుదలగా ముందుకెళుతోన్నవేళ.. అమరావతి రైతలు నిరసనలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంఘీభావం తెలపడం అధికార వైసీపీలో కలకలం రేపింది. సేవ్ అమరావతి ఉద్యమం పట్ల వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటం.. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలనుకుంటున్న టీడీపీ నేతల్ని వైసీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడే అడ్డుకుంటున్న సందర్భంలో యువ ఎంపీ తీరు చర్చనీయాంశమైంది.
దీక్షా శిబిరంలో బైఠాయింపు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ అక్కడి రైతులు దాదాపు 45 రోజులుగా దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆ దీక్షలవైపు వైసీపీ నేతలెవరూ కన్నెత్తిచూసిందిలేదు. అసెంబ్లీ సమావేశాల టైమ్ లో రైతుల్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం.. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయడం, ఉద్యమవేడికి సీఎం జగన్ కాన్వాయ్ సైతం రూటుమార్చుకోవడం తెలిసిందే. అదనపు బలగాల ఉపసంహరణ తర్వాత ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు శుక్రవారం సడెన్ గా మందడంలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపర్చారు. రైదులతో కలిసి దీక్షా శిబిరంలో బైఠాయించారు.
ఉద్యమానికి మద్దతు
రాజధాని రైతులు చేస్తోన్న ఉద్యమానికి వ్యక్తిగతంగా తాను మద్దతిస్తానని ఎంపీ కృష్ణదేవరాయలు చెప్పారు. ఇక్కడి రైతుల ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులపై తనకు అవగాహన ఉందని, రైతుల న్యాయమైన డిమాండ్లు తప్పక పరిష్కారం కావాల్సిందేనని ఆయన అన్నారు. రాజధానికి భూములిచ్చిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగబోదని ఎంపీ హామీ ఇచ్చారు.
రైతులతో సర్కారు చర్చలు..
మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతులెవరూ భయపడాల్సిన అవసరంలేదని, తాను దగ్గరుండిమీరీ ఒక్కక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని వైసీపీ ఎంపీ రైతులకు భరోసా ఇచ్చారు. రాజధాని రైతుల డిమాండ్లపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను కూడా నియమించబోతున్నట్లు తెలిపారు. ఆయా కమిటీలు గ్రామాలకు వచ్చినప్పుడు.. రైతులంతా ధైర్యంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన సూచించారు.
ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు
మందడం దీక్షా శిబిరంలో మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీకి వ్యతిరేకంగా కొంతమంది రైతులు నినాదాలు చేశారు. మూడు రాజధానులపై అభిప్రాయం చెప్పాలని, రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని వాగ్ధానం చేయాలని రైతులు పట్టుపట్టారు. దీంతో కృష్ణదేవరాయ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. రైతులకు న్యాయం జరిగే ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
అసలేం జరుగుతోంది?
ఇప్పటిదాకా అమరావతి రైతులకు ప్రతిపక్షపార్టీలు మాత్రమే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో నర్సారావుపేట వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు మందడం పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ఎంపీ ఇలా ఎందుకు చేశారో, అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదని అమరావతికి చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సీఎం ప్లానేంటి?
రైతులతో మంతనాలు జరిపిన సందర్భంలో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు ప్రస్తావించిన ‘కమిటీ'లు ఏంటనేవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రైతులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ మొదటి నుంచీ చెబుతున్నా.. ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మండలి రద్దు తర్వాత టీడీపీ తన యాక్టివిటీలను దాదాపు తగ్గించింది. సరిగ్గా ఈ సమయంలోనే వైసీపీ ఎంపీ ఎంట్రీకావడం సీఎం ప్లాన్ లో భాగంగా జరిగిందేనా? రాజధాని రైతులు నిరసనలు విరమించేలా ఆయనేం చేయబోతున్నారనేది తెలియాల్సిఉంది.