స్పీకర్పై జగన్ అసహనం: పోడియం పైకి టీడీపీ సభ్యులు: చంద్రబాబు ఖబడ్దార్..!
ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో తీరు ఆసక్తి కరంగా మారింది. 45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్ ఇస్తామని జగన్ ప్రకటించారని..దీని పైన ఎందుకు అమలు చేయరంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చినా వారు ఆందోళన చేయటంతో ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. వారు సభలో నుండి బయటకు వెళ్లకపోవటంతో మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు.ఆ తరువాత సభలో చంద్రబాబు అనుమానాల పైన సీఎం జగన్ వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు చేతిలో పేపర్ అడిగి మరీ తీసుకొని.. వివరణ ఇచ్చారు. ఆ సమయంలో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్పైనా జగన్ ఆసహనం వ్యక్తం చేసారు.
టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు : జగన్ ప్రభుత్వంలో తొలిసారిగా: సమావేశాలు ముగిసే వరకూ ..!
చంద్రబాబు వర్సెస్ జగన్..
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తరువాత సభలోకి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తిరిగి మరో సారి అప్పటి వరకు సభలో చర్చ జరిగిన అంశం మీదే తిరిగి ప్రశ్నించారు. సాక్షి దిన పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ను చూపిస్తూ..45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకొని చంద్రబాబు చేతిలోని పేపర్ తెప్పించుకున్నారు. ఆ పేపర్ ప్రచురణ అయిన రోజు 2017 అక్టోబర్ 18వ తేదీ అని చెబుతూ..తాను పాదయాత్రలో 2018 సెప్టెంబర్ 3న చేసిన ప్రకటన గురించి వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆ తరువాత అనేక సమావేశాల్లో..ఎన్నికల ప్రచారంలోనూ తాను వైయస్సార్ చేయూత ద్వారా అందించే సహాయం గురించి వివరించానని చెప్పుకొచ్చారు. బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీలక 50 శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తన్నా మని..దీనిని తట్టుకోలేక చంద్రబాబు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ సీఎం ఫైర్ అయ్యారు.
స్సీకర్ పైనా అసహనం..
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణలకు వివరణ ఇచ్చిన జగన్ ఇక ఈ అంశాన్ని ముగించాలని కోరారు. తాను ప్రజలకు చెప్పిందే మేనిఫెస్టోలో పెట్టామని..దానినే అమలు చేస్తున్నామని వివరించారు. గంటన్నారకు పైగా చర్చ జరిగిందని.. ఇక మరో అంశం పైన చర్చకు వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో చంద్రబాబు మరో సారి మైక్ కోసం కోరారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘుపతి అందుకు అనుమతించారు. దీంతో..జగన్ అసహనానికి గురయ్యారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చామని..చంద్రబాబు సభలోకి వచ్చి మరో సారి ప్రశ్నిస్తే తిరిగి మరలా సమాధానం ఇచ్చామని..అయినా మరో సారి చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వటం.. తిరిగి మేము సమా ధానం చెప్పుకుంటూ పోతే ఎప్పటికి సమస్య పరిష్కారం అవుతుందని ప్రశ్నించారు. స్పీకర్ స్థానంలో ఉన్న మీరు సైతం ఇలా చేయకూడదంటూ ముఖ్యమంత్రి అసహనాన్ని ప్రదర్శించారు.
ఖబడ్దార్ చంద్రబాబు..
ముఖ్యమంత్రి సమాధానం తరువాత కూడా టీడీపీ సభ్యులు ఆందోళన వీడలేదు. స్పీకర్ పోడియం మీదకు ఎక్కి ఆందోళన కొనసాగించారు. జస్టిస్ చేయాలంటూ నినాదాలు చేసారు. స్పీకర్ చైర్ పక్కనే నిలబడి నినాదాలు చేయటం తో స్పీకర్ ఇబ్బందికి గురయ్యారు. ఆ సమయంలో వైసీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బిల్లులను చూసి తట్టుకోలేక ఆందోళన చేస్తున్నారంటూ మండి పడ్డారు. ప్రతిపక్షానికి ఇంతగా సమయం ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు లేదన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు మరింత గట్టిగా నినాదాలు చేస్తుండ టంతో శ్రీధర్ రెడ్డి ఖబడ్దార్ చంద్రబాబు అంటూ మూడు సార్లు హెచ్చరించారు. దీనికి ప్రతిగా టీడీపీ సభ్యులు సైతం తమ స్వరాలు పెంచి ఆందోళన కొనసాగించారు. పోడియం పైకి టీడీపీ సభ్యులు రావటంతో స్పీకర్ సభను వాయిదా వేసారు.