చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ ఊరట! మా నినాదం అదే.. పొత్తుపై తేల్చేసిన ఊమెన్ చాందీ
Recommended Video
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోమని, ఆ ప్రశ్నే లేదని, తాము ప్రజలతో పొత్తు పెట్టుకుంటామని, ఇదే 2019 ఎన్నికలకు తమ నినాదం అని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాంది అన్నారు. తాము ఒంటరిగానే వెళ్తామని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరి పోరు తమకు సవాలేనని, కానీ తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఏపీలో పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ఇంటింటికి తిరుగుతామని చెప్పారు. నాలుగేళ్ల పాటు బీజేపీ, టీడీపీలు కలిసి ఉండి ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేయలేదు
పార్టీలతో కాదు ప్రజలతోనే మా పొత్తు.. ఇదే 2019కి తమ నినాదమని ఊమెన్ చాందీ చెప్పారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో, బయటా యూపీఏ హయాంలో తాము హామీ ఇచ్చామని, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదన్నారు. దాదాపు నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రంపై ఒత్తిడి చేయలేదని విమర్శించారు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్సే దోషి, ఆ పార్టీ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ మాట్లాడుతున్నారన్నారు. కాగా, గత కొన్నాళ్లుగా చంద్రబాబు - కాంగ్రెస్ కలుస్తారని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే టీడీపీ తేల్చేసింది. ఇప్పుడు ఊమెన్ చాందీ కూడా ఏ పార్టీతోను కలవమని స్పష్టం చేశారు. ఊమెన్ చాందీ వ్యాఖ్యలు టీడీపీకి కూడా ఊరట అని చెప్పవచ్చు.
బీజేపీ మోసం చేస్తోందని ఊమెన్ చాందీ ఆగ్రహం
బీజేపీ అన్ని విషయాల్లోనూ మోసం చేస్తోందని ఊమెన్ చాందీ మండిపడ్డారు. ప్రజల్లో ఎంతో అసంతృప్తి నెలకొందన్నారు. వారు మార్పు కోసం చూస్తున్నారన్నారు. అంతకుముందు, ఊమెన్ చాందీ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఏపీసీసీ కార్యవర్గ సమావేశం వాడిగా, వేడిగా జరిగింది. పార్టీ బలోపేతానికి సహకరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.
రఘువీరా పనితీరుపై సంతృప్తి
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలన్నారు. మాజీ ఎంపీ చింతమోహన్ మాట్లాడుతూ... పార్టీలో దళితులకు నాయకత్వం ఇవ్వాలన్నారు. పలువురు రఘువీరా పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులందరికీ లక్ష్యాలను నిర్ధేశించాలని కొందరు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల, బూత్ స్థాయిల్లో కమిటీలను బలోపేతం చేయాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయాలన్నారు.
రాహుల్ గాంధీతోనే సాధ్యమనే నినాదం
ఇవన్నీ జూన్ 15 నుంచి సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలంటూ ఊమెన్ నేతలకు సూచించారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 48వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీకి ప్రత్యేకహోదా రావాలన్నా, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా, రాహుల్తోనే సాధ్యం' అనే నినాదంతో 19న రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు.