ఇంకా కొనసాగుతోన్న పోలింగ్ : 80 శాతం నమోదయ్యే అవకాశం
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 400 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తోన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటర్ల స్లిప్పులను అందజేశారు అధికారులు. దీంతో వయోజనులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది.
శాపంగా మారిన సాంకేతిక లోపం
పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో వేలాది మంది ఓటర్లు బారులు తీరి ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగాల్సి ఉంది. కానీ ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల ఉదయం ఓటర్లు వెనుదిరిగారు. తర్వాత సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన వారందరికీ ఈసీ స్లిప్పులు అందజేసింది. దీంతో వారు సాయంత్రం వచ్చి ఓటేసేందుకు బారులుతీరారు. గురువారం రాత్రి 9.30 గంటల వరకు 400 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ 80 శాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని ఈసీ అంచనా వేస్తోంది.