సీఎం..సీఎస్ వివాదం : పాలన గాలికి వదిలేసారా : గవర్నర్ జోక్యం తప్పదా..!
Recommended Video
ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్లు వేసే వరకూ ప్రజలే దేవుళ్లన్నారు. ఓట్ల ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రం ఎవరి పంతాలు వారికి ముఖ్యంగా మారుతున్నాయి. సమిష్టి బాధ్యతతో పాలన సాగించాలని మంత్రులు..అధికారులు రెండుగా చీలిపోయారు. సీయం అధికారాల కోసం మంత్రులు సీయస్ పై దండయాత్ర చేస్తున్నారు. సీయస్ మాట కాదనలేని అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా ఏపిలో పాలన గాలికొదిలేస్తున్నారు. ఈ సరిస్థితని చక్కదిద్దటానికి ఇక గవర్నర్ జోక్యం తప్పదా అనే చర్చ మొదలైంది.
ఎవరి పంతం వారిదే..
ఏపిలో ఎన్నికల తరువాత విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ పేరుతో ఎన్నికల సంఘం..రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగిన మాటల యుద్దం..ఇప్పుడు ఎన్నికల సంఘం నియమించిన సీయస్..రాష్ట్ర మంత్రుల మధ్యా వార్గా మారింది. ఏపిలో కొద్ది రోజులుగా పూర్తిగా పాలన పడకేసింది. ముఖ్యమంత్రికి సమీక్షలు చేసే అధికారం లేదంటూ ఎన్నికల సంఘం..విపక్షాలు వాదిస్తున్నాయి. సీయస్ సైతం సీయం ఆధీనంలో ఉండాల్సిందేనని మంత్రులు తమ వాదన వినిపిస్తున్నారు. దీంతో..పాలన పూర్తిగా గాలికొదిలేసారు. వేసవి తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఉష్గోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 43- 46డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని హెచ్చరికలు వస్తున్నాయి. తాగు నీటి ఎద్దడి ఉన్నా..పట్టించుకోవటం లేదు.
ముంచుకొస్తున్న తుఫాను..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి తుఫానుగా తీవ్రతరం కానుంది. 29నాటికి తీవ్ర తుఫానుగా మారనుంది. దీని పైన ఏపిలో ఇంత వరకు సమీక్ష జరగలేదు. సచివాలయంలోని ఆర్టీజీయస్ ఇచ్చే హెచ్చరికలు..సమాచారం తప్ప జిల్లా కలెక్టర్లతో ముందస్తు ఏర్పాట్ల పైనా కనీసం అప్రమత్తత చర్యలు లేవు. ముఖ్యమంత్రి సిమ్లా వెళ్లగా..రెండు రోజుల పాటు సీయస్ ఢిల్లీలో ఉన్నారు. ఇక, ఏపిలో సాధారణ పాలన దాదాపుగా నిలిచిపోయింది. మే23 వరకు కనీసం పేదలకు అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిదులు కూడా అందే పరిస్థితి లేదు. అకాల వర్షాలతో రైతులు అనేక ప్రాంతాల్లో నష్ట పోయారు. పిడుగుల కారణంగా మరణాలు చోటు చేసుకున్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలు మినహా రాష్ట్ర స్థాయి నుండి వారికి మార్గదర్శకం చేసే వారు లేరు.
గవర్నర్ జోక్యం తప్పదా..
సీయయం..సీయస్ ఇద్దరిలో ఎవరి మాట చెల్లుబాటు కావాలనే అంశం పైన మాత్రమే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి సమీక్ష చేయాల్సిందే అంటూ ఆయన క్యాబినెట్ మంత్రులు..పార్టీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి సీయస్ పై ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కాదనలేక.. తాము ఏం చేయాలో తెలియక సీనియర్ అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. గవర్నర జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంకు కీలకమైన సీయం..సీయస్ మధ్య హక్కులు పేరిట వివాదం నడుస్తూ..పాలన పక్కన పడేస్తున్న పరిస్థితుల్లో గవర్నర్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.