చరిత్రలో తొలిసారి: పొత్తు లేకుండా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ: ఘోర పరాజయం
అమరావతి: తోడు లేనిదే పోటీ చేయదు అనే అపవాదు తెలుగుదేశం పార్టీపై ఉంది. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న ప్రతిసారీ తెలుగుదేశం ఏదో ఒక జాతీయ పార్టీపై ఆధారపడి పోటీ చేస్తుంటుంది. ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. దాని ఫలితం ఎలా ఉందనే విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించుకోనక్కర్లేదు. దారుణ పరాజయం. ఘోర ఓటమి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనంత పరాభవాన్ని మూటగట్టుకుంది ఆ పార్టీ. ఒంటరిగా పోటీ చేస్తే- ఫలితం ఎంత దారుణంగా ఉంటుందనేది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసి వచ్చి ఉంటుంది.
ఏపీ ఫలితాల వేళ ట్విస్ట్.. కోడి కత్తి శీనుకు బెయిల్
1999లో ఆదుకున్న వాజ్ పేయి ఛరిష్మా..
తన మామ, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసి, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న తరువాత చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న తొలి సార్వత్రిక ఎన్నికలు 1999. అప్పట్లో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. వాజ్పేయి ఛరిష్మా, కార్గిల్ యుద్ధం వంటి అంశాలు కలిసి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచింది. దీన్ని గ్రహించిన చంద్రబాబు- ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలను ఎదుర్కొన్నారు. గెలిచారు. 2004 ఎన్నికలకు వచ్చే సరికి చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు.
మోడీపై వ్యతిరేకతతో కమలానికి దూరం
గోద్రా ఉదంతం అనంతరం- గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల వల్ల బీజేపీ పనైపోయిందని గుర్తించారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్రానికి వస్తే అరెస్టు చేస్తానని హూంకరించారు. కమలనాథులతో తెగదెంపులు చేసుకున్నారు. పొత్తులు కావాలిగా? అందుకే వామపక్షాలను కలిశారు. వారితో కలిసి 2004 ఎన్నికల్లో పోటీకి దిగారు. దారుణంగా ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 47 స్థానాలకే పరిమితం అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్-టీఆర్ఎస్ కూటమిని ఎదుర్కొన లేక చతికిలపడ్దారు.
పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?
మహాకూటమి కట్టినా, వైఎస్ ధాటికి నిలవలేక..
2009 నాటికి మరోసారి కూటమి చంద్రబాబు. 2004లో ఏ టీఆర్ఎస్తోనైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూటమి కట్టారో.. అదే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకొన్నారు. మహాకూటమిగా అవతరించారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కూడా తమ కూటమిలో చేర్చుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. మహాకూటమి, ప్రజారాజ్యంలను ఒంటరిగా ఎదుర్కొన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనవిధంగా కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాగలిగారు. ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు.
2014 మళ్లీ బీజేపీతోనే
2014 నాటికి చంద్రబాబు మరోసారి పొత్తుల కోసం ఎదురు చూశారు. అప్పటికే రాష్ట్ర విభజన చోటు చేసుకుంది. దేశంలో నరేంద్ర మోడీ హవా వీస్తుండటంతో ఆయనతో చేతులు కలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సీట్లను సర్దుబాటు చేసుకున్నారు. పవన్ కల్యాణ్నూ వెంటేసుకుని తిరిగారు. అధికారంలోకి రాగలిగారు. 600లకు పైగా హామీలను ఇచ్చారు. ఇంతా చేసినప్పటికీ.. వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో మాత్రమే గెలిచింది.
2019 ఎన్నికలకు పొత్తుకు ఏ పార్టీ లేదు..
ఇక- 2019 నాటికి వచ్చే సరికి పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశానికి ఎవరూ దొరకలేదు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఛీ కొట్టారు. నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. 2014లో చంద్రబాబుకు అండగా నిలిచిన పవన్ కల్యాణ్ కొత్తగా జనసేన పార్టీ పెట్టారు. ఆలస్యంగానైనా చంద్రబాబు యూజ్ అండ్ త్రో వైఖరి తెలిసిన వామపక్షాలు మరోసారి టీడీపీతో జట్టు కట్టడానికి వెనుకాడారు. పొత్తు కోసం ఏ పార్టీ మిగల్లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో కలవడం, అక్కడా రెండు సీట్లకే పరిమతం కావడం వంటి ఎదురు దెబ్బలు తగిలినిందున మన రాష్ట్రంలో హస్తం పార్టీని కలుపుకొని వెళ్లడానికి సాహసించలేదు చంద్రబాబు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒంటరిపోరుకు దిగారు. దీని ఫలితం- 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో టీడీపీకి దక్కింది కేవలం 23 సీట్లే. 52 స్థానాలు ఉన్న రాయలసీమలో చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ తప్ప పార్టీకి చెందిన మరో అభ్యర్థి గెలవలేదు. వాష్ అవుట్ అయిపోయిందా పార్టీ. భవిష్యత్తులో మరోసారి ఒంటరిగా పోటీ చేయాలంటే కలలో కూడా భయపడిపోయేంత ఓటమిని ఎదుర్కొన్నారు చంద్రబాబు.