ఆరుగురు సీనియర్లు..మిగిలిన వారంతా తొలి సారే: యువతకు ప్రాధాన్యం: రెండున్నారేళ్లలో..!
ఏపీ యువ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ ప్రకటించిన కేబినెట్లో ఆరుగురు మాత్రమే గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. మిగిలిన వారికి మంత్రులుగా ఇదే తొలి సారి.ఒక్క శంకర నారాయణ మినహా అందరూ ఒక్క సారి కంటే ఎక్కవ సార్లు గెలిచిన వారే. జగన్ కేబినెట్లో యువ మంత్రుల్లో ఎక్కువ మంది జగన్ వీర విధేయులే. అనిల్..గౌతం..అంజద్ బాషా లాంటి వారు జగన్ వాయిస్ను బలంగా వినిపించగల సమర్ధత ఉన్నవారు. అదే సమయంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటంలో నైపుణ్యం ఉన్నవారు కేబినెట్టో ఉన్నారు.
ఆరుగురు సీనియర్ మంత్రులు..
జగన్ ఎంపిక చేసుకున్న కేబినెట్లో ఆరుగురు గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్నవారు ఉన్నారు. వారిలో బొత్సా సత్యానారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పి విశ్వరూప్, మోపిదేవి వెంకట రమణ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వీరంతా నాడు వైయస్ కేబినెట్లో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. ఇక, ప్రస్తుతం వీరు జగన్ కేబినెట్లోనూ స్థానం దక్కించుకున్నారు. జగన్ చెప్పినట్లుగా వీరు రెండున్నారేళ్లు కొనసాగుతారా లేక తమ సామర్ధ్యం నిరూపించుకొని రెండో విడత కేబినెట్లోనూ ఉంటారా అనేది చూడాల్సి ఉంది. అయితే, ధర్మాన కృష్ణదాస్ సోదరుడు ధర్మాన ప్రసాద రావు సైతం గతంలో వైయస్సార్ కేబినెట్లో పని చేసారు. పార్ధసారధి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు ఉన్నా..సామాజిక సమీకరణాల్లో అవకాశం దక్కలేదు.
వైసీపీ మౌత్ పీస్లకు ప్రాధాన్యత..
జగన్ తన కేబినెట్లో పార్టీ వాయిస్ బలంగా వినిపించగలిగిన వారిని సైతం గుర్తించారు. అందులో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాధ్, మేకపాటి గౌతం రెడ్డి, పేర్ని నాని, బొత్సా సత్యానారాయణ, ఆది మూలపు సురేష్, అవంతి శ్రీనివాస్, పుష్ఫ శ్రీవాణి, విశ్వరూప్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు జగన్ విధేయులుగా ఉన్నారు. వీరు ఎన్నకల ముందు నుండి వైసీపీ మౌత్ పీస్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, అంబటి రాంబాబు, భూమన కరుణాకర రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పార్ధసారధి, కారుమూరు నాగేశ్వరరావు, శ్రీకాంత రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మల్లాది విష్ణు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ముస్తఫా లాంటి వారు ఇక పార్టీ తరపున కీలక బాధ్యతలు వహించాల్సి ఉంటుంది.
రెండేళ్ల తరువాత వీరు అటు..వారు ఇటు..
జగన్ శాసనసభా పక్ష సమావేశంలో ఒక విషయం స్పష్టం చేసారు. ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తున్నారో.. వారిలో మొత్తం 25 మందికి గాను 20 మంది వరకు రెండున్నారేళ్ల తరువాత పార్టీ కార్యక్రమాలను చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వంలో అవకాశం దక్కని వారు పార్టీ కార్యక్రమాల పైన దృష్టి పెట్టాలని..వారికి రెండున్నారేళ్ల తరువాత జరిగే విస్తరణలో ఖచ్చితంగా అవకాశం ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు పదవులు రాని వారు మరో రెండున్నారేళ్ల వరకు నిరీక్షించక తప్పదు. అదే సమయంలో ఇప్పుడు మంత్రులు అయిన వారు తమ పని తీరు ద్వారా పదవులు పోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.