సీమలో అన్నీ పాయె! టీడీపీ నుంచి గెలిచింది బాబు, బాలయ్యే! 52 సీట్లల్లో టీడీపీ దక్కింది రెండే!
కడప: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర్ సీపీ సునామీని తెలుగుదేశం పార్టీ కంచుకోటలు తట్టుకోలేకపోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. తెలుగుదేశానికి గట్టిపట్టు ఉన్న అన్ని జిల్లాలూ ఈ సునామీలో కొట్టుకునిపోయాయి. ప్రత్యేకించి- రాయలసీమలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనాన్నే సృష్టించింది.
రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తెలుగుదేశం గెలిచింది రెండంటే రెండు మాత్రమే. ఆ రెండు కూడా ఒకటి చిత్తూరు జిల్లా కుప్పం, రెండోది అనంతపురం జిల్లాలోని హిందూపురం. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు.
పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?
కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చివరి వరకూ ఆధిక్యంలో కొనసాగినప్పటికీ చివరికి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్పై స్వల్పంగా ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ప్రతి రౌండ్కూ ఫలితాలు తారుమారు అవుతుండటంతో కర్నూలు ఫలితంపై ఉత్కంఠత నెలకొంది. చివరి రౌండ్కు వచ్చే సరికి హఫీజ్ ఖాన్ ఘన విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. మెజారిటీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ తన ఖాతాలో వేసుకుంది.
కడప, కర్నూలు జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ప్రత్యర్థులకు ఒక్క నియోజకవర్గాన్ని కూడా విడిచి పెట్టలేదు. కడపలో పదికి పది, కర్నూలులో 14కు 14 స్థానాల్లో జయ కేతనాన్ని ఎగుర వేసింది. అనంతపురం జిల్లాలో ఒక్క హిందూపురం మినహా మిగిలిన 13 సీట్లల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయ బావుటాను ఎగుర వేశారు. చిత్తూరులో కుప్పంలో చంద్రబాబు నాయుడు మినహా.. మిగిలిన అన్ని చోట్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు అఖండ విజయాన్ని అందుకున్నారు.