పవన్కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..
హైదరాబాదు: జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు తొలిషాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు శనివారం లోటస్పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్పై అసంతృప్తితోనే గేదెల శ్రీనుబాబు వైసీపీ గూటికి చేరినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.
వైసీపీ కండువా కప్పుకున్న గేదెల శ్రీనుబాబు
గేదెల శ్రీను ప్రముఖ పారిశ్రామికవేత్త. ఉత్తరాంధ్రలో స్వచ్చంధంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ దృష్టిని ఆకర్షించారు. ఇక జనసేన నుంచి పార్టీ టికెట్ కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అభ్యర్థులు లేకపోవడంతో గేదెల శ్రీనుకు విశాఖ పార్లమెంటు సీటు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ప్రజల నుంచి స్పందన రాకపోవడం, మిగిలిన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం జరుగుతుండటం, ప్రణాళిక లోపం రాజకీయ ఎత్తుగడల్లో వైఫల్యం ఉందని తమ దగ్గర గేదె శ్రీనుబాబు నిర్మొహమాటంగా వ్యాఖ్యానించినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. పశ్చిమ గోదావారి జిల్లాలో అభ్యర్థుల ప్రకటనపై తమను సంప్రదించకుండానే పవన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కొందరు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏకంగా జనసేన ప్రకటించిన ఎంపీ అభ్యర్థే పార్టీని వీడి పవన్కు ఊహించని ట్విస్టు ఇచ్చారు. ఇదిలా ఉంటే మరికొందరు జనసేన పార్టీ నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన రాజకీయ విశ్లేషకులు పెంటపాటి
ఇదిలా ఉంటే మరో సీనియర్ రాజకీయ విశ్లేషకులు పోలవరం ఉద్యమనేత విద్యావేత్త, ఢిల్లీలో సత్సంబంధాలున్న వ్యక్తి పెంటపాటి పుల్లారావు. పవన్ విధానాలపట్ల ఆకర్షితులై జనసేనలో చేరారు. పోలవరం ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉండటంతో ఆ సీటును పెంటపాటి పుల్లారావుకు కేటాయించారు. ఇక అంతకుముందు అభ్యర్థుల ప్రకటన తర్వాత టీడీపీకి చెందిన ఆదాల ప్రభాకర్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు టీడీపీ నెల్లూరు రూరల్ టికెట్ కేటాయించింది. అయినప్పటికీ పార్టీని వీడి వైసీపీలో చేరారు ఆదాల ప్రభాకర్.
వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు
మరోవైపు సాయంత్రం నుంచి వైసీపీలోకి చేరికలు పెరిగాయి. ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి వైసీపీలో చేరగా...విశాఖ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. చేరికలను అన్నిటినీ విజయసాయిరెడ్డి దగ్గర ఉండి సమీక్షిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విజయ్ సాయిరెడ్డిపై టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తమ పార్టీలోనుంచి అభ్యర్థులను విజయసాయిరెడ్డి లాక్కుంటున్నారని ఆరోపించింది. మొత్తానికి ఎన్నికల వేళ వైసీపీ ఎత్తుగడలు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.