టీడీపీ హయాంలో పథకాలన్నీ పక్క రాష్ట్రాల నుండి కాపీ కొట్టినవే..కానీ జగన్ అలా కాదు:మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వైయస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పై విజయవాడలో మాట్లాడారు. వైయస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ హయాంలో రైతులకు మేలు జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అందిస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో పక్క రాష్ట్రాల పథకాలను కాపీ కొట్టే వారిని, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర విద్యుత్ సంస్కరణల భాగంగా ప్రతి రైతుకు మీటర్ కనెక్షన్ ఇస్తామని రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వటమే వైయస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రతి నెల రైతులు వాడిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యేక బ్యాంకు ఎకౌంటు ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గా తెలిపారు. విద్యుత్ శాఖ మాత్రమే ఆ అకౌంట్ లోని నిధులను వాడుకుంటోందని ఇందులో రైతులు భయపడాల్సిన అవసరం ఏదీ లేదంటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు మాత్రం ఉచిత విద్యుత్ కు సంబంధించి మీటర్లు బిగించటం వల్ల రైతులపై పెను భారం పడుతుందని విమర్శలు గుప్పించాయి .కేంద్ర సంస్కరణల్లో భాగంగానే మీటర్లు ఇస్తున్నామని , కేంద్రం నాలుగు రంగాల్లో నగదు బదిలీ తెచ్చిందని, అందులో భాగంగానే నగదు బదిలీ అమలు చేయాల్సి వస్తోందని చెప్తోంది అధికార వైసీపీ .రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కరెంట్ బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయిన తర్వాతనే బిల్లులు చెల్లిస్తారు అని ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది .