ఆ కేసులో కోర్టుకు హాజరు కాని విజయమ్మ , షర్మిల , కొండా దంపతులు .. రీజన్ ఇదే
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తో పాటు కొండా దంపతులు 2012లో నాటి వరంగల్ జిల్లా పరకాలలో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభను నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నేడు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే నేడు నిందితులు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు కొండా మురళీ, సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు.
2012లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు
ఇటీవల హైదరాబాద్ స్పెషల్ కోర్టు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితోపాటు ఆమె కుమార్తె షర్మిలకు, కొండా మురళి, సురేఖ దంపతులకు సమన్లను జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. 2012లో వైఎస్ విజయమ్మ, షర్మిల ఎలాంటి అనుమతి తీసుకోకుండానే సభను నిర్వహించడంతోపాటు ఎన్నికల కోడ్ ఉల్లఘించారని పరకాల పోలీసు స్టేషన్ లో వీరిద్దరిపై కేసు నమోదు అయింది.
పరకాల ఉప ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా సభ నిర్వహించారని కోర్టు సమన్లు
అప్పట్లో సురేఖ వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె జూన్ 12,2012 న జరిగిన ఉప ఎన్నికలలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో యై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసారు. అప్పుడు ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభకే అనుమతి లేదని కేసు నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబందించి కోర్టు వీరితోపాటు కొండా దంపతులకు కోర్టు సమన్లను జారీ చేసింది.వారికి కోర్టు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని తెలుస్తోంది.
నేడు కోర్టుకు హాజరు కాని నిందితులు .. సమన్లు అందకపోవటమే కారణం
సమన్లు జారీ అయినా, అధికారికంగా వారికి ఇంకా అవి చేరలేదని ఈ కారణంతో వారెవరూ నేడు కోర్టుకు హాజరు కావడం లేదని సమాచారం. ఈ విషయాన్ని కొండా సురేఖ తెలిపారు. తమకు ఎటువంటి సమన్లూ రాలేదని, మీడియాలో వార్తలు వచ్చిన తరువాత, తాను వివరాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఇంకా తమకు కోర్టు సమన్లు అందలేదని కోర్టుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేశారు. సమన్లు అందాక న్యాయపరమైన సలహాతో ముందుకు వెళ్తామని చెప్పారు.