2019 లో ప్రధానిని నిర్ణయించేది...టిడిపినే;చంద్రబాబే కీలకం:లోకేష్
అనంతపురం:జగన్,పవన్ బిజెపితో బీజేపీతో లాలూచీ పడి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత వరకు భావ్యమని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. వాళ్లకు నిజంగా దమ్ము,ధైర్యం ఉంటే ఆరోపణలపై సాక్ష్యాధారాలను ప్రజల ముందుంచాలని లోకేష్ సవాల్ విసిరారు.
మంత్రి నారా లోకేష్ బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. మడకశిరలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ జగన్, పవన్, బిజెపిలపై ధ్వజమెత్తారు. బిజెపి ఇచ్చే స్క్రిప్ట్ నే జగన్,పవన్ చదువుతారని లోకేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానిని నిర్ణయించేది టిడిపియేనని లోకేష్ పునరుద్ఘాటించారు.
పవన్ దూరం...విమర్శలు
మూడు నెలల కిందటి వరకు మాతో స్నేహంగా ఉన్న పవన్ కల్యాణ్...బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకోగానే విమర్శలు చేయడం వెనక ఆంతర్యమేమిటని మడకశిరలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ ప్రశ్నించారు. గాల్లో ఆరోపణలు, విమర్శలు చేయడం కంటే వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రజల ముందు పెడితే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు.
అప్పుడే...మాతాత...నాన్న సిఎంలు
"నేను పుట్టినప్పుడు నా తాత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి...నేను స్కూల్లో చదివేటప్పుడు నా తండ్రి చంద్రబాబు సీఎం...మాది ఒక పద్ధతి కలిగిన కుటుంబం...వైసీపీది దొంగ పార్టీ...అదో డ్రామా కంపెనీ...దానికి డైరెక్షన్ చేసేది ప్రధాని మోడీ...స్క్రిప్ట్ ఇచ్చేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా"...అని లోకేష్ విరుచుకుపడ్డారు.
మోడీ...ఒక్క వార్త రాదు
నన్ను విమర్శించే ఆ దొంగబ్బాయికి ఒక దొంగపత్రిక ఉందని, అందులో మోడీ గురించి ఒక్కనాడైనా వ్యతిరేక వార్తను ప్రచురించారా అని లోకేష్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో దేశ ప్రధానిని నిర్ణయించేది టీడీపీయేనని...అప్పుడు చంద్రబాబు కీలకంగా మారతారని లోకేష్ చెప్పారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏ విధంగా డిపాజిట్లు గల్లంతయ్యాయో...2019లో కూడా బీజేపీకి అదే గతి పడుతుందని లోకేష్ జోస్యం చెప్పారు.
మోడీని...నిలదీయండి
పవన్కు, జగన్కు ధైర్యముంటే ప్రత్యేక హోదాపై ప్రధానిని నిలదీయాలని లోకేష్ సవాలు విసిరారు. ప్రతిపక్షాలు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బంగడుపుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. అందుకే అందరం అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. విభజన హామీలు 90 శాతం పూర్తి చేశామని బీజేపీ చెబుతోందని, అయితే ఆ పార్టీ నేతలు ప్రధానికి ఇచ్చిన వినతిపత్రం చూస్తే అసలు వాస్తవాలు ఏంటో తెలిసిపోయాయని లోకేష్ అన్నారు.