ఏపి బీజేపిలో సీఎం అభ్యర్థి ఎవరైనా కావొచ్చు..! రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
అమరావతి/హైదరాబాద్: ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని అనుకోవడం లేదని.. అయితే, పదేళ్లలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన్ను 'మీరు భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా' అని ప్రశ్నించగా... ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని.. తాను సీఎం కావాలనుకోవడం లేదని అన్నారు. అయితే... ఏపీలో సమర్థులైన నేతలున్నారని.. వారిలో ఎవరైనా తమ పార్టీలో చేరి కష్టపడి పనిచేసి సీఎం కావొచ్చని చెప్పుకొచ్చారు.
ఏపీలో బీజేపీ వెతుకుతున్న ఆ సీఎం కేండిడేట్..! కష్టపడితే సీఎం సీటు గ్యారెంటీ..!!
రాం మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగొలుపుతున్నాయి. ఏపీలో సమర్థుడైన ఒక నేత... బీజేపీకి సీఎం అభ్యర్థి కాగల నేత.. పార్టీని అధికారంలోకి తేవడంలో సహకరించగల నేత కోసం బీజేపీ చూస్తోందని అర్థమవుతోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలను కాకుండా ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి పార్టీని అధికారం వైపు నడిపించే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. అయితే.. బీజేపీ ఇందుకోసం టీడీపీ నేతల్లో సెర్చ్ మొదలుపెట్టిందా.. వైసీపీ నుంచి వెతుక్కుంటోందా.. లేదంటే జనసేన నుంచి సీఎం అభ్యర్థిని కోరుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.
తెలంగాణ లో బీజేపి పుంజుకుంటుంది..! తప్పకుండా పాగా వేస్తామన్న రాం మాధవ్.!!
మరోవైపు రాంమాధవ్ ఈ ఇంటర్వ్యూలో.. తెలంగాణలో 2024లో తాము అధికారంలోకి రావడానికి చాన్సుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం ద్వారా, అధికారానికి దగ్గరవుతామని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ కలుపుకుని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని పెట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో పాటు, మరో రెండు చోట్ల రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, అది బీజేపీ పార్టీయేనని అన్నారు.
హోదా గురించి మాట్లాడితే టైం వేస్టు అవుతుంది..! కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల 9న ప్రధాని మోదీ తిరుపతి పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసారు. మోడీ ఈ ఆదివారం సాయంత్రం 4.30గంటలకు తిరుపతి చేరుకోనున్నారని, ఆ తరువాత సాయంత్రం 5.10 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తిరుమల పద్మావతి వసతిగృహానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించారు. సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారని, అదే రోజు రాత్రి 8గంటలకు తిరిగి దిల్లీకి పయనమవుతారు.
మొక్కులు చెల్లించుకునేందుకే మోదీ వస్తున్నారు..! రాజకీయ టూర్ కాదన్న బీజేపి..!!
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 9వ తేదీన తిరుమలకు వస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానికి స్వాగతం పలుకనున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. తిరుమల కొండపై పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని..అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత రాత్రి 8.30 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. మరోవైపు, ఏపీ బీజేపీ నేతలు కూడా మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.