శ్వేతపత్రాల పేరుతో అప్పట్లో బోగస్ పత్రాలు .. ఇప్పుడు తాళపత్రాలు తెచ్చినా లాభం లేదట బాబు
ఏపీలో అధికారం పోగొట్టుకుని, ప్రతిపక్ష పార్టీకి పరిమితమైన టిడిపిపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మాత్రమే కాకుండా, అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసి మాటలు తూటాలుగా పేలుస్తున్నారు. డోస్ పెంచి మరి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దొంగలు, అవినీతిపరులంటూ తిట్టి పోస్తున్నారు.మీ అవినీతి బండారం బయట పెడతామని పదేపదే హెచ్చరిస్తున్నారు.
పిచ్చోడి చేతిలో రాయి .. మీ చేతిలో అధికారం ఒక్కటే .. జగన్ పై కేశినేని
అసెంబ్లీ ఎన్నికల ముందు 10 శ్వేతపత్రాల పేరుతో బాబు బోగస్ పత్రాలు విడుదల చేశారన్న విజయసాయి
ఇక ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రతినిత్యం దాడులు చేసే రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోమారు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును అప్పుడు నమ్మలేదు .. ఇప్పుడు జనాలు నమ్మరు అన్న విజయసాయి
చంద్రబాబు తన పాలనలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాయి అని, శాఖల వారీగా ఎన్నికలకు ముందు శ్వేత పత్రాలు విడుదల చేసి వాటిని గ్రామ గ్రామాన ప్రజలకు సైతం తెలియజేయాలని ప్రయత్నం చేశారు. ఇక శ్వేతపత్రాలు నుద్దేశించి అది బోగస్ పత్రాలు అంటూ విజయ్ సాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆ బోగస్ పత్రాలను నమ్మని ప్రజలు చంద్రబాబును ఓటమి పాలు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇప్పుడు సైతం చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన తేల్చి చెప్పారు.
తాళపత్రాలు విడుదల చేసినా లాభం లేదు .. అమరావతిపై బాబు ఏడుపు అందుకే అన్న వైసీపీ నేత
అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా పెంచిన అంచనాలను ఇప్పుడు బయటపెడతామని, అందుకే టీడీపీ నాయకులు ఉలికిపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతే కాదు ప్రజా సమస్యల కంటే తన కరకట్ట నివాసం, బినామీల ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంపైనే చంద్రబాబు గారి ఆందోళనంతా అని ఎద్దేవా చేశారు . అమరావతిని ఎంపిక చేసిందే తన బినామీల స్థిరాస్తి వ్యాపారం కోసం అన్న విజయసాయి పునాదులు కూడా లేవని అమరావతిని చంపేశారని చంద్రబాబు శోకాలు పెడుతున్నారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.