రాకెట్ యుగంలోనూ కులపిచ్చిగాళ్ళు .. పీటల మీద పెళ్లి ఆపి వెళ్ళిపోయిన ఘనులు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ , అంతరిక్షంలోనూ అద్భుతాలు సృష్టిస్తున్న నేటి రాకెట్ యుగంలో , ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రపంచమే ఒకటిగా చూస్తున్న నేటి తరుణంలో కూడా కుల పిచ్చి ఉందంటే మీరు నమ్ముతారా .. ? కులం కోసం కాదు కేవలం పేరు చివర ఉండే కులం తోక కోసం పీటల మీద పెళ్లినే కాదని వెళ్ళారంటే మీరు నమ్ముతారా ? నమ్మశక్యం కాకున్నా కచ్చితంగా నమ్మి తీరాల్సిందే . అలాంటి కుల పిచ్చి పట్టిన వాళ్ళు చేసిన పనికి ఒక వధువు కన్నీటి పర్యంతం అవుతుంది అంటే మన సమాజంలో వేళ్ళూనుకున్న కుల పిచ్చి ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
లోకేష్ కు భద్రత కుదింపు ... బ్రాహ్మణికి, భువనేశ్వరికి నో సెక్యూరిటీ
పేరు చివర రెడ్డి లేదని పెళ్లి ఆపేసిన వరుడి తల్లిదండ్రులు
ఇక అసలు విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో పీటలపై ఓ పెళ్లి ఆగిపోయింది. వధువును కాదని పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు వరుడు . అసలు పెళ్లెందుకు ఆగిపోయింది అంటే వధువు ఆధార్ కార్డ్లో పేరు చివర రెడ్డి అని లేదట . పేరు చివర రెడ్డిలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు పెళ్లి కొడుకు, తల్లిదండ్రులు కులం అవునో కాదో అన్న అనుమానంతో పెళ్లిని మధ్యలోనే ఆపేశారు. క్రోసూరు మండలం గాదెవారిపాలెంకు చెందిన యువతితో సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన మున్నంగి వెంకటరెడ్డితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఇక ఇద్దరికీ వివాహం చెయ్యటానికి పెదకాకాని శివాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో వధువు మెడలో తాళికట్టాల్సి ఉండగా పెళ్లి కూతురు పేరుకు,ఆమె తండ్రి పేరుకు తోకగా ఆధార్ కార్డులో రెడ్డి అని లేదని పెళ్లిని ఆపేసి పందిట్లోంచి వెళ్లిపోయాడు వరుడు .
పెళ్లి ఆగిపోవటంతో వధువు తల్లిదండ్రుల ఆవేదన .. పోలీసులకు ఫిర్యాదు
ఇక పీటల దాకా వచ్చిన కూతురు పెళ్లి ఆగిపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె కు మళ్ళీ ఎలా వివాహం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. అర్థాంతరంగా పెళ్లి ఆగిపోవడంతో ఆందోళన చెందిన వధువు తల్లిదండ్రులు క్రోసూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దేశమంతటా కులాంతర వివాహాలు జరుగుతుంటే ఇంకా కొన్ని చోట్ల కులం, మతం అంటూ పందిట్లో పెళ్లుళ్లు ఆపేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . విచిత్రంగా పేరు చివర తోకగా రెడ్డి అని లేదంటూ పెళ్లిని ఆపేయడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినా మారని కుల పిచ్చి
కంప్యూటర్ మీద పరుగులు తీస్తున్న కాలంలోనూ ఇంకా కులం కోసం ఇంతగా ప్రాకులాడుతున్నారు జనాలు. మరీ ఇంతగా ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతుంది అని కూడా ఆలోచించకుండా పెళ్లి ఆపేసి వెళ్ళిపోయిన కుల పిచ్చిగాళ్ళు మన సమాజంలో చాలా మందే ఉంటారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుంది అన్న కోపం తో ప్రణయ్ ను హత్య చేయించిన మారుతీరావు వంటి తండ్రులు ఉన్నారు ఈ సమాజంలో, కులం కోసం పెళ్లి ఆపి వెళ్ళిపోయిన వరుడి కుటుంబం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎంత అభివృద్ధి చెందినా కులం , మతం అంటూ సామాజిక కట్టుబడులకే తలొగ్గి మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏం అభివృద్ధి చెందినట్టు మనం అనే ప్రశ్న ఉదయించక మానదు .