పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ..కేంద్రం ముందు వైసీపీ 9 డిమాండ్స్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశంలోపాల్గొన్న వైసీపీ ఎంపీలు.. ఏపీకి హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని బీజేపీ పదేపదే చెప్పినప్పటికీ వైసీపీ మాత్రం ప్రత్యేక హోదా పాటనే పాడుతుంది. ఇక అంతే కాదు ఏపీకి రావాల్సిన పెండింగ్ గ్రాంట్ల విడుదలతో పాటు మరో ఎనిమిది అంశాలను కేంద్రం ముందుంచారు .
కేంద్రానికి వైఎస్సార్సీపీ 9 అంశాలపై విజ్ఞప్తి
పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభా పక్షనేత మిథున్రెడ్డి సహా పలువురు విపక్ష నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వైఎస్సార్సీపీ 9 అంశాల గురించి ప్రధానంగా మాట్లాడారు .ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
పెండింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని కోరిన వైసీపీ
అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3, 283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలని పేర్కొంది.పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55, 548 కోట్లను ఆమోదించాలని కోరింది. అంతే కాదు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన 18, 969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది .
పారిశ్రామిక ప్రోత్సాహం కావాలని వినతి
వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు ఇవ్వాలని కోరింది. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని సూచించారు . రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని అప్పుడే ఏపీ అభివృద్ధి చెందుతుందని పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు . రాజధాని అభివృద్ధి కోసం గ్రాంట్గా రూ. 47, 424 కోట్లు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ కేంద్రానికి విఙ్ఞప్తి చేసింది.