ఆ రెండు విషయాల్లో...ఏపీనే నంబర్ వన్:సిఎం చంద్రబాబు
అమరావతి: మన దేశంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఉండవల్లిలోని తన క్యాంప్ ఆఫీసు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై అధికారులతో సమీక్షించారు.
అంతేకాదు ప్రతి ఏడాది రూ.6 వేల కోట్లకు పైగా సొమ్మును పింఛన్లకు ఖర్చు చేస్తున్న రాష్ట్రం కూడా ఏపీనేనని సిఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రజల్లో 80% సంతృప్తి ఉందన్నారు. పింఛన్ల పంపిణీ ద్వారా లబ్దిదారుల్లో ఆత్మగౌరవం పెంచామని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ జరిగేలా శ్రద్ధ పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
సమీక్ష సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మందికి పింఛన్లు ఇస్తున్నారు...కొత్తగా ఎన్ని పింఛన్లు మంజూరుయ్యాయనే వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 47,26,341 మందికి ప్రతినెలా పింఛన్లు అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ీ సందర్భంగా ముఖ్యమంత్రి మత్స్యకారులకు ఫించన్ల పంపిణీ గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న 33,722 మంది మత్స్యకారులకు తక్షణమే పింఛన్లు అందజేయాలని సిఎం ఆదేశించారు.
అలాగే పింఛన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. సేవా దృక్ఫథంతో సంక్షేమ శాఖ యంత్రాంగం, అధికారులు పనిచేయాలని చంద్రబాబు హితవు పలికారు. రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో 50లక్షల కుటుంబాలకు రూ.6 వేల కోట్లు అందిస్తున్నామని సిఎం ఈ సందర్భంగా వెల్లడించారు. పేదల సేవే మన పరమావధిగా భావించాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.