తిరుపతి పుణ్య క్షేత్రంలో కక్కుర్తి పడ్డాడు .. నిలువు దోపిడీకి గురయ్యాడు
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల వెళ్ళిన ఒక భక్తుడు ఆ దేవ దేవుని దర్శించుకుని వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. అలా కాకుండా అతను చేసిన కక్కుర్తి పనికి కొండపైకి వెళ్లకుండానే స్వామివారిని దర్శించుకోకుండానే నిలువుదోపిడి ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళితే కడప జిల్లా రాయచోటి కి చెందిన రవి అనే యువకుడు ఏడుకొండలూ ఎక్కి ఆ తిరుమలేశుని దర్శించుకోవాలని తిరుపతి బస్టాండ్ లో వేచి ఉన్నాడు. ఇక ఇదే సమయంలో అతని పక్కన నిలబడిన యువతితో మాటలు కలిపాడు. ఇక ఆమెను చూసి కక్కుర్తి పడిన రవి ఆమె పిలిచి వెంటనే ఆమెతో కలిసి పక్కకి వెళ్ళాడు.
ఈ లోగా ఊహించని పరిణామంగా ముగ్గురుదుండగులు రవి వద్ద ఉన్న మొత్తం నగదు, స్మార్ట్ ఫోను నుండి బట్టలతో సహా దోచుకెళ్లారు. దీంతో యువతిని చూసి కక్కుర్తిపడిన అతగాడు కొండపైకి ఎక్కకుండానే నిలువు దోపిడీకి గురయ్యాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు రవి. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. ప్లాన్ ప్రకారమే యువతిని ఎరగా వేశారని, యువతిని చూసి కక్కుర్తి పడిన రవిని ఆమె ప్లాన్లో భాగంగానే పక్కకు తీసుకెళ్ళింది అని ఆ తర్వాత ముగ్గురు దుండగులు రవిని నిలువునా దోచుకున్నారని పోలీసులు చెప్తున్నారు.
రవి వద్దనుండి 18 వేల నగదును, ఒక స్మార్ట్ ఫోన్, వాచ్, క్రెడిట్ కార్డులు, దుస్తులు ఉన్న బ్యాగ్ లను దోచుకెళ్లారని అతను ఆర్టీసీ సిబ్బందిని ఆశ్రయించగా, వారి సలహా మేరకు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇక సంఘటనా స్థలంలోని సిసి టివి కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అనవసరంగా యువతిని చూసి కక్కుర్తిపడి, సర్వం నిలువుదోపిడీ ఇచ్చానని వాపోతున్న రవి బాధను చూసి, ఇలా కూడా దోపిడీ చేస్తారా అని ఆలోచించేవారు కొందరైతే, పుణ్యక్షేత్రంలో పాడు పని చెయ్యాలనుకున్నందుకే తగిన శాస్తి జరిగిందని ఆలోచిస్తున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఇలాంటి కేటుగాళ్లు ఈమధ్య పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా తారసపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.