రాజధానులపై కరుణించండి- కేంద్రానికి జగన్ మరో రిక్వెస్ట్- సోము అమరావతి జపమే కారణం
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియపై ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభిస్తోందని భావిస్తున్న ఏపీ సర్కారు తాజాగా అనుమానంలో పడిందా ? ఏపీలో బీజేపీ అమరావతి రాగాలు ఆలపిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని భావిస్తోందా ? కేంద్రం సహకారం లేకుండా మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమనే అభిప్రాయానికి సర్కారు వచ్చేసిందా ? తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీలో మూడు రాజదానులకు మద్దతివ్వాలని సీఎం జగన్ మరోసారి కోరడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో తాజా పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మూడు రాజధానులపై కేంద్రం...
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంబించడానికి ముందే కేంద్రానికి ఈ అంశంపై సమాచారం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపుతోంది. దీంతో హైకోర్టులో జరుగుతున్న మూడు రాజధానుల పిటిషన్ల విచారణలోనూ కేంద్రం తమకెలాంటి అభ్యంతరాలు లేవని అఫిడవిట్లు దాఖలు చేస్తోంది. కేంద్రం దాఖలు చేస్తున్న అపిడవిట్లలోనూ రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోని అంశమేనని, ఇందులో తమ జోక్యం ఉండబోదని పలుమార్లు స్పష్టం చేసింది.
దీంతో ఇక రాజధానుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని జగన్ సర్కారుతో పాటు సాధారణ ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేతల తాజా వ్యాఖ్యలతో ఈ వ్యవహారానికి ట్విస్ట్ ఇచ్చారు.
సోము వీర్రాజు అమరావతి రాగాలు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో తమ జోక్యం ఉండబోదని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని ఓవైపు తమ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తుంటే మరోవైపు ఏపీ బీజేపీ నేతలు మాత్రం అమరావతికి మద్దతుగా స్వరం పెంచుతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా అమరావతే రాజధాని, ఈ విషయంలో ప్రధాని మోడీదీ అదే మాట అంటూ ట్విస్ట్ ఇచ్చారు.
దీంతో వైసీపీ ప్రభుత్వం కూడా డైలమాలో పడింది. కేంద్రం రాజధాని విషయంలో తమను ఇరికించేందుకు చూస్తోందా అన్న అనుమానాలు ప్రభుత్వంలో మొదలయ్యాయి. తాజాగా జగన్ -అమిత్షాతో భేటీలోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది.
రాజధానులపై కేంద్రం మద్దతు కోరిన జగన్
మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టులో అఫిడవిట్లు వేస్తూ, మరోవైపు పార్టీ నేతలతో అమరావతి రాగాలు వినిపిస్తున్న బీజేపీ తీరుపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారు. దీంతో రాజధానుల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ హోంమంత్రి అమిత్షాకు మరోసారి విజ్ఞప్తి చేశారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని, ఇది 2019 ఎన్నికల్లో మీ అజెండాలోని అంశమేనని షాకు జగన్ గుర్తుచేశారు.
మిగిలిన రాజధానులకూ లైన్ క్లియర్ చేయాలని కోరారు. దీంతో ఇప్పుడు కొత్తగా జగన్ ఈ విషయంలో కేంద్రానికి చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు హైకోర్టులో పిటిషన్ల విచారణ, మరోవైపు బీజేపీ అమరావతి రాగాలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ వినతి సాధారణం మాత్రం కాదని తెలుస్తోంది.
రాజధానులపై బీజేపీ ఇరుకునపెడుతోందా ?
మూడు రాజధానుల విషయంలో తనకు మద్దతిచ్చినట్లే ఇచ్చి పార్టీ నేతలతో అమరావతికి మద్దతుగా కామెంట్లు చేయిస్తున్న బీజేపీ తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని అమిత్షా వద్దే తేల్చుకోవాలని నిర్ణయించారు. కానీ అమిత్ షా నుంచి కూడా ఈ విషయంలో జగన్కు పూర్తి భరోసా లభించినట్లు కనిపించడం లేదు.
కేంద్రం తమ రాజ్యాంగ బాధ్యత నెరవేర్చింది కానీ రాజకీయాలు మామూలే అన్నట్లుగా షా చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో మూడు రాజధానుల విషయంలో బీజేపీ తనను ఇరుకున పెడుతుందా అని జగన్ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగో జనవరిలో రాజధానులపై హైకోర్టు తుది తీర్పు రాబోతోంది. అనంతరం దీనిపై ఓ కార్యాచరణ సిద్దం చేసుకోవాలనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.