వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ మళ్లీ వార్తల్లో నిలిచింది. జీతాల పెంపు కోరుతూ వాలంటీర్లు ఆందోళనలు దిగడం, వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు, సేవ అని సీఎం స్పష్టత ఇవ్వడం, ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర ఆరోపణలు చేయడం, ఒకరిద్దరు నేతలైతే వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ చేయడం తదితర పరిణామాల నడుమ రాష్ట్రంలోని వాలంటీర్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు, ఆదేశాలు వెలువరించారు..
నిమ్మగడ్డ వల్ల జగన్కు నష్టమెంతో తెలుసా? -చతికిలపడ్డా చుక్కల్లో అంకెలా? -ఏపీలోనూ 'మిషన్ భగీరథ'
ప్రోత్సాహక, పురస్కారాలు..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేస్తోన్న వారికి ఇకపై సముచిత రీతిలో ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందజేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ఏడాది ఉగాది పండుగ రోజునే వాలంటీర్లను సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని, ఇప్పటికే మెరుగైన సేవలు అందిస్తోన్న వారిని.. సేవారత్న, సేవామిత్ర లాంటి పేర్లతో సత్కరించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర ప్రణాళిక శాఖపై సమీక్షలో సీఎం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
వాలంటీర్ వ్యవస్థ ఆధునీకరణ
ప్రణాళిక శాఖపై సమీక్ష సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను మరింతగా ఆధునీకరించాల్సిన అవసరాన్ని సీఎం వివరించారు. నిర్ధేశిత లక్ష్యాలు త్వరిత గతిన సాధించేలా గ్రామ సచివాలయంలో డేటా క్రోడీకరణ కోసం 'డిజిటల్ అసిస్టెంట్'కు ఈ బాధ్యతలు అప్పగించాలని, మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్ వైజ్ చేస్తారని సీఎం పేర్కొన్నారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న డేటాను స్వీకరించి, ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ-క్రాపింగ్ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా ఇ-క్రాపింగ్ తీరు తెన్నులు తెలుస్తాయని, గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల వద్ద ఇంటర్నెట్ సర్వీసు, డేటా క్రోడీకరణ వాలంటీర్ల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. దీనివల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుందని సీఎం స్పష్టం చేశారు. అయితే..
ప్రపంచ సంస్థల భాగస్వామ్యం
వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోలాంటి సంస్థలతో కూడా కలిసి పనిచేయాలని సూచించారు. డేటాను కేవలం సేకరించడమే కాకుండా.. ఆ డేటా ద్వారా తీసుకోవాల్సిన చర్యలమీద కూడా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. సీఎం సమీక్షా సమావేశానికి ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ విజయ్కుమార్, కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్ సీఈవో జే విద్యాసాగర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే..
వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను వెంటనే తీసేయాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధి కాకుండా ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని విమర్శించారు. ఆ వ్యవస్థను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. కుప్పంలో కూడా ఎవరిని నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ పూర్తిగా భయబ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
5రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు -మార్చి 7న షెడ్యూల్ -ఈసీ కంటే ముందే మోదీ హింట్ -బీజేపీ పక్కా