నాలుగోసారి కొలిక్కిరాని ఏపీ, తెలంగాణా ఆర్టీసీ చర్చలు.. దసరాకి బస్సుల కోసం ప్రజల ఎదురుచూపులు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి ఇరురాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు మరో మారు సందిగ్ధంగానే ముగిశాయి. అంతర్ రాష్ట్రాల మధ్య బస్సులను పునరుద్ధరించడం, రవాణా కొనసాగించటంపై ఎలాంటి నిర్ణయం లేకుండా అధికారులు మరోమారు చర్చల్లో మాట్లాడదాం అంటూ ముగించారు.
బస్ భవన్ లో ఏపీ, తెలంగాణా ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ..దసరాకైనా బస్సులు నడుస్తాయా?
నాలుగోదఫా ఫలించని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ (ఆర్టీసీ) ఉన్నతాధికారుల మధ్య చర్చలు బుధవారం సాయంత్రం కూడా అస్పష్టంగానే ముగిశాయి . కిలోమీటర్లలో సమానత్వంతో పాటు రూట్లలో కూడా సమాన సర్వీసులు అనే అంశాన్ని తెలంగాణ అధికారులు చర్చించడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది .ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలోగా చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని వర్గాలు తెలిపాయి. దసరాకు ముందు మరోమారు చర్చలు జరుగుతాయా లేదా అనేది కూడా సందిగ్ధమే . కరోనా మహమ్మారి కాలంలో ఇది నాలుగో దఫా జరిగిన ఫలించని చర్చలు.
రెండు రాష్ట్రాల మధ్య సమాన కిలోమీటర్ల ప్రతిపాదన .. మరోమారు సందిగ్ధత
ఎన్ని కిలోమీటర్లు బస్సులను నడపాలన్న దానిపైన ఇంతకు ముందు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు భేటీలో చర్చల్లో పురోగతి సాధించినా మరోమారు తాజాగా జరిగిన చర్చల్లో మొత్తం 2.65 లక్షల కిలోమీటర్లకు 65 వేల తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ ఇప్పుడు మళ్ళీ మరో 40వేల కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే తెలంగాణా అధికారులు తాజాగా లక్షా 61 వేల కిలోమీటర్లు తాము నడుపుకుంటామని, ఏపీ కూడా అదే విధంగా సమాన కిలోమీటర్లు నడపాలని ప్రతిపాదించింది . దీనిపై మళ్ళీ అలోచించి చెప్తామని ఏపీ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు . దీంతో చర్చలు ఒక ముగింపుకు రాకుండానే ముగిశాయి.
బస్సు సర్వీసుల విషయంలోనూ తేలని లెక్క .. వీడని ప్రతిష్టంభన
ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రానికి ప్రతిరోజు 375 బస్సు సర్వీసులను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ 206 సర్వీసులకు మాత్రమే పరిమితం కావాలని ఏపీ ముందు ప్రతిపాదన పెట్టింది. అయితే తాము బస్సులను తగ్గించుకుంటే, ఆ ప్రాంతాల్లో తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతుందా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని ఏపీ, తెలంగాణ అధికారులను కోరింది. దీనిపై తెలంగాణ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. కొన్ని రూట్లలో ఎవ్వరూ బస్సులు నడప కపోతే ప్రైవేటు ట్రావెల్స్ కు లాభం చేకూరుతుందని ఏపీ అభిప్రాయపడుతోంది.
అన్ని అంశాలపై గట్టిగా పట్టుబడుతున్న తెలంగాణా .. బస్సుల రవాణాకు నో
తెలంగాణ అధికారుల తీరు మాత్రం తమ ప్రతిపాదనలను ఏపీ ఆమోదించాలి అన్న పట్టుదలతోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం అటుంచి అసలే పండుగ సీజన్ కావటంతో , దసరాకైనా ప్రయాణీకుల ఇబ్బంది దృష్ట్యా ఆర్టీసీ బస్సుల రవాణా ఇరు రాష్ట్రాల మధ్య పునరుద్దరిస్తారు అనుకుంటే అదీ లేకుండా ఆర్టీసీ అధికారుల చర్చలు ముగిశాయి. దసరాకైనా బస్సులను నడుపుదామని ఏపీ అధికారులు కోరినా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ విషయంలో అంశాలన్నింటిపై క్లారిటీ వస్తేనే బస్సులు నడుపుదామని తెలంగాణా ఆర్టీసీ అధికారులు చెప్పినట్టు సమాచారం .
Recommended Video
ప్రయాణీకులకు తప్పని ఎదురు చూపు ..
దసరాకు కూడా ఆర్టీసీ బస్సులు మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు . ఇప్పుడు మరోమారు భేటీ అవుతామని చెప్పిన అధికారులు దసరాలోపు భేటీ అయితే ఆర్టీసీ బస్సుల రవాణాపై స్పష్టత వస్తుందా అనేది మాత్రం ప్రశ్నగానే ఉంది . మరోపక్క దేశం అంతా ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఉన్నా రెండుతెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు లేకపోవటం తెలుగురాష్ట్రాల ప్రయాణీకులకు ఇబ్బందికరంగా మారింది .