కష్టమైనా తప్పలేదు- కేంద్రం కండిషన్లకు జగన్ ఓకే... క్లిష్ట సమయంలో భారీ ఊరట !
కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్రాలు కూడా నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. సొంత ఆదాయం లేక, రుణాలు తీసుకునే వీలు లేక, లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక సతమతం అవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీలో ఓ అంశం రాష్ట్రాలకు ఇప్పుడు భారీగా ఊరటనిస్తోంది. ముఖ్యంగా భారీ రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిర్ణయం గొప్ప ఊరట కానుంది. అయితే అక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.
హాట్ స్పాట్ గా మారిన మంగళ హాట్ ప్రాంతం .. ఒకే ఇంట్లో 16 మందికి కరోనా
కేంద్రం నిర్ణయంతో ఊరట- కండిషన్స్ అప్లై..
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధికంగా వెసులుబాటు ఇచ్చేందుకు కేంద్రం తాజా ఉద్దీపన ప్యాకేజీలో కొన్ని మినహాయింపులు ప్రకటించింది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీఎస్డీపీలో 3 శాతం వరకూ మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ చేయగలిగితే 3.5 శాతం వరకూ అవకాశం ఉండేది. అంతకు మించి రూపాయి కూడా అప్పు చేయడానికి వీల్లేదు. కానీ తాజాగా కేంద్రం దాన్ని కొన్ని షరతులతో 5 శాతానికి పెంచింది. అయితే ఇందుకు విధించిన షరతులు తెలుగు రాష్ట్రాలను చికాకుపెట్టేలా ఉన్నాయి.
కేంద్రం షరతులేంటంటే... ఏపీకి ఊరట ఎందుకంటే...
రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలంటే అవి కొన్ని షరతులు పాటించాలని కేంద్రం టార్గెట్ పెట్టింది. అందులో వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సంస్కరణలు, పట్టణ స్ధానిక సంస్ధల ఆదాయాల క్రమబద్ధీకరణ చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు విషయంలో కానీ, ఈజ్ ఈఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ, స్ధానిక సంస్ధల ఆదాయాల క్రమబద్దీకరణ విషయంలోనూ కానీ తెలుగు ప్రభుత్వాలకు, ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఎటొచ్చీ విద్యుత్ చట్టంలో సవరణల విషయంలోనే ఇబ్బందులు ఉన్నాయి. అయితే విద్యుత్ చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తున్న తెలంగాణకు ఇబ్బందులు తప్పకపోవచ్చు కానీ దీనిపై ఇప్పటికే మౌనంగా ఉంటున్న జగన్ కు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పవచ్చు.
విద్యుత్ చట్టంపై రాష్ట్రాలకు ముకుతాడు...
కేంద్రం ఇప్పటికే పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్టంలో సవరణల బిల్లుపై తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం దీనిపై ఇప్పటివరకూ ఎక్కడా స్పందించలేదు. కరోనా నేపథ్యంలో ఎక్కడా అప్పు పుట్టని ప్రస్తుత పరిస్దితుల్లో జగన్ విద్యుత్ చట్టంపై రాజీ పడితే ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు అసాధ్యమేమీ కాదు. మిగతా రాష్ట్రాలదీ ఇదే పరిస్ధితి. దీన్ని ముందే గ్రహించిన కేంద్రం.. విద్యుత్ చట్టాన్ని ఆమోదింపచేసుకోవడానికే ఈ లంకె పెట్టిందని భావిస్తున్నారు.
Recommended Video
కష్టకాలంలో ఏపీకి అత్యవసరం..
ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఏపీ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. కొత్తగా మద్యం మినహా మిగిలిన ఏ రంగాల్లోనూ ఆదాయం పుట్టే పరిస్దితి లేదు. గతంలో భారీగా అప్పులు ఆఫర్ చేసిన వారు కూడా తాజాగా సైలెంట్ అయిపోయారు. ఇలాంట పరిస్ధితుల్లో జగన్ సర్కార్ ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు కోసం విద్యుత్ రంగం సంస్కరణలు సహా ఇతర షరతులకు కూడా ఆమోదం తెలిపే అవకాశమే కనిపిస్తోంది. అన్నింటికంటే మిన్నగా మౌనమే తన సమాధానంగా జగన్ వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ఏపీకి ఈ ఆర్ధిక సంవత్సరంలో 20 వేల కోట్ల మేర అదనపు రుణాలు తెచ్చుకునే అవకాశం లభించబోతోంది.