కమలేష్చంద్ర కమిటీ సిఫార్సుల అమలు కోసం...మే 22 నుంచి పోస్టల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
అమరావతి:కమలేష్చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ పోస్టల్ ఉద్యోగులు ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు చేయనున్నట్లు పోస్టల్ ఎంప్లాయిస్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ (జెసిఎ) శనివారం సమ్మె నోటీస్ ఇచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) వేతన సిఫార్సులపై 2015లో కమలేష్ చంద్ర కమిటీని నియమించారు. ఈ కమిటీ 2017 నవంబరు 26న తన నివేదిక సమర్పించింది. అయితే కారణాలేంటో తెలియదు కానీ పోస్టల్ ఉద్యోగుల వేతనాల సవరణలో నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం పెండింగ్లోనే ఉంచింది. ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలనే ఏకైక డిమాండ్తో పోస్టల్ ఉద్యోగులు ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు జెసిఎ సమ్మె నోటీస్ను ఇచ్చింది.
వివిధ యూనియన్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్ఎఫ్పిఇ), ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎన్పిఒ), ఆల్ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ (ఎఐజిడిఎస్యు), నేషనల్ యూనియన్ గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ (ఎన్యుజిడిఎస్)లు జాయింట్ కౌన్సిల్ఆఫ్ యాక్షన్ (జెసిఎ)గా ఏర్పడి ఈ నిరవధిక సమ్మెకు దిగనున్నాయి. కమిటీ సానుకూలంగా నివేదిక ఇచ్చినా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై యూనియన్ల నేతలు మండిపడుతున్నారు.