సినిమా రీస్టార్ట్ ప్యాకేజీ... సీఎం జగన్కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు...
కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'ఎగ్జిబిటర్లకు సినిమా రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. థియేటర్ల పునరుద్దరణకు,తెలుగు సినీ పరిశ్రమపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలకు లబ్ది చేకూర్చేందుకు మీరు తీసుకున్న చర్యలు దోహదపడుతాయి.' అని చిరు ట్వీట్ చేశారు.
Recommended Video
కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న నేపథ్యంలో... ఎగ్జిబిటర్లకు ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో నెలకు రూ.3కోట్లు చొప్పున భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు దీనితో లబ్ది చేకూరనుంది.
అలాగే సినిమా రీస్టార్ట్ ప్యాకేజీ కింద థియేటర్లకు ప్రభుత్వమే రుణాలు ఇవ్వనుంది. ఏ, బి, సెంటర్లలో రూ.10లక్షల చొప్పున, సి- సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు అందించనుంది. అంతేకాదు,ఈ రుణాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.4.18 కోట్ల భారం పడనుంది.ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ పరిశ్రమల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి... సినీ పరిశ్రమ పునఃప్రారంభానికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఉత్తేజాన్నిస్తాయని అన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోలు,సురేష్ ప్రొడక్షన్స్ కూడా సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపాయి.
My sincere gratitude to @YSJagan garu for the very compassionate #CinemasRestartPackage for Exhibitors.The various relief measures are the need of the hour for the sustenance of Theatres & #TeluguFilmIndustry as a whole & will greatly benefit livelihoods of thousands of families.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 18, 2020