ఎన్టీఆర్ అర్ధనారీశ్వరుడిలా కనిపించారు: ట్రాన్స్జెండర్ ఇష్యూపై శశిథరూర్
న్యూఢిల్లీ: స్వర్గీయ నందమూరి తారక రామారావు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 ఏళ్ల క్రితమే అర్దనారీశ్వరుని ఆహార్యంతో కనిపించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
తన సొంత రాష్ట్రమైన కేరళలో ఉన్న మాదిరిగా ట్రాన్స్జెండర్ల కోసం జాతీయ విధానాన్ని రూపొందించడంపై కేంద్రం దృష్టి సారించాలని శశిథరూర్ సూచించారు. బ్రిటిష్ కాలం నాటి భారత శిక్షాస్మృతిని సవరించాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు.
స్వలింగ సంపర్కులు పలురకాల వివక్ష, నింద, హింసలను ఎదుర్కొంటూ వారి బతుకులు వారు బతుకుతుంటే దానికీ వీల్లేకుండా చేయాలన్నట్లుగా బిజెపి ప్రయత్నిస్తోందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
మహాభారతంలో శిఖండి పాత్ర కనిపిస్తుందనీ, దేవుడు కూడా సగం స్త్రీ, సగం పురుషుడుగా ఉంటాడని చెప్పడానికి అర్ధనారీశ్వరుడే ఉదాహరణ అని శశిథరూర్ పేర్కొన్నారు. దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 ఏళ్ల క్రితమే అర్ధనారీశ్వరుని ఆహార్యంతో కనిపించారని గుర్తు చేశారు.
భారత్ మాతా కీ జై అంటేనే దేశభక్తి అని చెప్పలేం
జెఎన్యు ఘటన నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం పైన కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆదివారం నాడు విమర్శలు గుప్పించారు. భారత్ మాతాకి జై అనే నినాదం ద్వారా ఒకరి దేశభక్తిని మనం కొలువలేమని వ్యాఖ్యానించారు.
నేను మాత్రం భారత్ మాతా కీ జై అనేందుకు సంతోషిస్తానని, అదే సమయంలో ఇతరులు కూడా అనాలని కోరుకుంటానని చెప్పారు. అయితే, మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇచ్చిందని చెప్పారు. భారత్ అంటే కేవలం హిందీ, హిందు, హిందుస్థాన్ మాత్రమే కాదన్నారు.