ప్యారిస్లో 'అరకు' ఘుమఘుమలు: లగ్జరీ బ్రాండ్ కోసం..
అరకు అంటే ప్రకృతి అందాలు, కట్టిపడేసే దృశ్యాలు, గిరిజనం, కొండ కోన గుర్తుకు వస్తాయి. ఆర్గానిక్ కాఫీకి చిరునామా 'అరకు'. ఈ అరకు కాఫీ భారత ఎల్లలు దాటి కాఫీ ప్రియులను అలరిస్తోంది.
విశాఖ: అరకు అంటే ప్రకృతి అందాలు, కట్టిపడేసే దృశ్యాలు, గిరిజనం, కొండ కోన గుర్తుకు వస్తాయి. ఆర్గానిక్ కాఫీకి చిరునామా 'అరకు'. ఈ అరకు కాఫీ భారత ఎల్లలు దాటి కాఫీ ప్రియులను అలరిస్తోంది.
ఇప్పటి వరకు అరుదైన నాణ్యత గల ఉత్పత్తులు ప్యారిస్ వంటి నగరాల నుంచి భారత్ వస్తుంటాయి. కానీ ఇప్పుడు తెలుగింటి అరకు కాఫీ ఘుమఘుమలు విదేశంలో గుబాళిస్తున్నాయి.
ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో అరకు ప్రాంతంలో భారీ ఎత్తున కాఫీ సాగును చేయడమే కాకుండా, అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
అరకు గ్లోబల్ హోల్డింగ్స్
ఇందులో భాగంగా 'అరకు గ్లోబల్ హోల్డింగ్స్' ప్యారిస్ మార్కెట్లో అడుగు పెట్టింది. ప్యారిస్లో రిటైల్ స్టోర్ ఏర్పాటు చేసి తద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి ఆరంగేట్రం చేస్తోంది.
వ్యాపారవేత్తలు కలిసి...
ఏపీలోని అరకు లోయలో ఆదివాసీలు పండించే అరబికా కాఫీ బ్లెండును ఈ రిటైల్ దుకాణంలో అరకు బ్రాండ్ పేరుతో ఈ కంపెనీ ప్రీమియం ధరకు విక్రయించనున్నది. అరకు గ్లోబల్ హోల్డింగ్స్ను సామాజిక వాణిజ్య సంస్థగా ప్రముఖ వ్యాపారవేత్తలు ఏర్పాటు చేశారు.
వీరే..
డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మాగంటి, మహింద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
రైతుల ప్రయోజనం కోసం
దీనిని నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్, ఇతర ట్రస్టీలు నిర్వహిస్తున్నారు. రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగించేందుకు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా తుది వినియోగదారులకే అమ్మకాలు చేయనుంది.
లగ్జరీ కాఫీ బ్రాండు గుర్తింపు కోసం..
అరకుకు భారత లగ్జరీ కాఫీ బ్రాండుగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పది రోజుల క్రితం ప్యారిస్లో స్టోర్ ఏర్పాటు చేస్తున్న సమయంలో.. ఆనంద్ మహీంద్రా ఈ విషయం చెప్పారు. త్వరలో యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి తేనున్నారు.
ప్యారిస్లో అడుగు
అరకు గ్లోబల్ హోల్డింగ్స్ ఆధ్వర్యంలో 20 వేల ఎకరాల్లో కాఫీ పంట సాగు అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అలరిస్తున్న అరకు కాఫీ.. ప్యారిస్లో అడుగు పెట్టడం 150 గిరిజన తెగల విజయం.
ప్రమోషన్
కాగా, విశాఖ మన్యంలో గిరిజనులు పండిస్తున్న కాఫీకీ సీఎం చంద్రబాబు తన వంతు ప్రమోషన్ చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీని రుచి చూపిస్తున్నారు. దాని గొప్పతనం చెబుతున్నారు.