చిత్తూరు టమాటాకు చైనా దెబ్బ
చిత్తూరు : చైనా దెబ్బకు చిత్తూరు రైతులు విలవిల్లాడుతున్నారు. పొరుగు దేశం భారత్లో భారీగా టమాట గుజ్జు డంప్ చేస్తుండటంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. చైనా టమాటా పల్ప్పై భారీ మొత్తంలో పన్ను విధిస్తున్నా చైనా తక్కువ రేటుకే గుజ్జు సరఫరా చేస్తుండటంతో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోంది. విధిలేని పరిస్థితుల్లో ఎంతో కొంతకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
మరో సారి నగరం ఖాళీ..! ఓటు బాట పట్టిన జనం.. !!
ఓడీఓపీ స్కీమ్పై ఆశలు
టమాట పంటకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. గతేడాది కేంద్ర ప్రభుత్వం చిత్తూరును వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాజెక్ట్ స్కీమ్కు ఎంపిక చేసింది. దీంతో టమాట రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఓడిఓపీలో భాగంగా టమాట,ఉల్లి, బంగాళాదుంప పంటలను ఎక్కువగా పండిస్తున్న జిల్లాల్లో వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు మద్దతివ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రైతులు పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆనందించారు. అయితే చైనా వారి ఆశలపై నీళ్లు చల్లింది.
ఆసియాలో అతిపెద్ద టమాటో మార్కెట్
దేశంలోనే అత్యధికంగా టమాటా ఉత్పత్తి జిల్లాల్లో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. మదనపల్లిలో ఉన్న టమాట మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. ఈ నేపథ్యంలో ఓడీఓపీలో భాగంగా ఈ ఏడాది కేంద్రం ఏపీకి రూ.110 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ నిధుల్లో రూ.50 కోట్లు మార్చిలో విడుదల చేసింది. రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చినా చిత్తూరు రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు విలవిల్లాడుతున్నారు.
తక్కువ ధరకే చైనా పల్ప్
చిత్తూరులో టమాటకు గిట్టుబాటు ధర పలకకపోవడానికి ప్రధాన చైనా నుంచి టన్నుల కొద్ది దిగుమతి అవుతున్న టమాట గుజ్జే కారణం. చైనా కంపెనీలు భారీ మొత్తంలో టమాటో పల్ప్ను భారత్లో డంప్ చేస్తుండటం, ధర తక్కువగా ఉండటంతో చైనా టమాట గుజ్జుకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా రైతులు పండించిన పంటకు సరైన ధర రావడం లేదు.
చైనాతో పోటీ
ఏపీలో భారీ స్థాయిలో టమాట ప్రాసెసింగ్ సౌకర్యాలు లేకపోవడం రైతుల కష్టాలకు కారణమవుతోంది. అక్కడి యూనిట్లకు గంటకు 10 నుంచి 15 టన్నుల టమాట పల్ప్ను మాత్రమే ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. అదే చైనా మెషీన్లు గంటకు 400 టన్నుల వరకు ప్రాసెస్ చేస్తాయి. ఫలితంగా వాటి నిర్వాహణ వ్యయం తగ్గుతోంది. ఇదిలా ఉంటే చైనా నుంచి వచ్చే టమాట గుజ్జుపై కేంద్రం 35శాతం యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తోంది. అయినా అక్కడి కంపెనీలు భారీ మొత్తంలో పల్ప్ను డంప్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని టమాట రైతులు కోరుతున్నారు.