చంద్రబాబు"గ్లోకల్ లీడర్";బ్లూమ్స్ బెర్రీ పుస్తకం:రచయిత్రి తేజస్విని పగడాల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఒక బ్రిటీష్ ప్రచురణ సంస్థ పుస్తకాన్ని ప్రచురించింది. బ్లూమ్స్ బెర్రీ సంస్థ ప్రచురించిన 'చంద్రబాబు నాయుడు - ఇండియాస్ గ్లోకల్ లీడర్' అనే పుస్తకం చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు తెస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ను స్థానికంగా అభివృద్ధి చేయడం...ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలపడం...ఈ రెండు పనులను ఏకకాలంలో చెయ్యడం ద్వారా...గ్లోబల్+లోకల్ లీడర్ గా..."గ్లోకల్ లీడర్"గా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఎదిగారనే విశ్లేషణ చేస్తూ తేజస్విని పగడాల అనే రచయిత్రి రాసిన ఈ పుస్తకాన్ని బ్రిటీష్ ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బెర్రీ ప్రచురించింది.
చంద్రబాబుతోనే...ఆవిష్కరించాలని...కానీ...
‘చంద్రబాబు నాయుడు - ఇండియాస్ గ్లోకల్ లీడర్' అనే ఈ పుస్తకాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే ఆవిష్కరింపచేయాలని బ్లూమ్స్ బెర్రీ సంస్థ ప్రతినిధులు భావించారు. కానీ ఆయనకు సమయం కుదరకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. అయితే పాఠకులకు, చంద్రబాబు అభిమానులకు ఈ పుస్తకాన్నిత్వరగా అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో నేరుగా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
కొత్త ప్రయోగం...గ్లోబల్+లోకల్
ఈ పుస్తకం నామకరణంలోనే గ్లోబల్,లోకల్ అనే రెండు పదాలను కలిపి.."గ్లోకల్" అనే కొత్త పదాన్నిసృష్టించడం విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఒక బ్రిటీష్ సంస్థ పుస్తకాన్నిప్రచురించడం, అది కూడా అనామక పబ్లిషర్స్ కాకుండా బాగా పేరున్నబ్లూమ్స్ బెర్రీ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పుస్తకం ద్వారా చంద్రబాబు లోకల్ గానే కాకుండా గ్లోబల్ గా కూడా మరింత గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని భావిస్తున్నారు.
ఈ పుస్తకంలో...ప్రధానాంశాలు...
ఈ పుస్తకంలో ప్రధానాంశాల విషయానికొస్తే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసాధారణ స్థాయికి ఎదిగిన వైనాన్ని, స్థానిక పరిస్థితుల నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకునేవరకు సాగిన ప్రస్థానాన్ని....అలాగే రాష్ట్రాన్ని లోకల్ గా అభివృద్ది చేస్తూ గ్లోబల్ గా గుర్తింపు తేవడం వంటి అరుదైన విజయాలను సొంతం చేసుకున్న నారా చంద్రబాబునాయుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రచించినట్లు రచయిత్రి పేర్కొన్నారు.
రచయిత్రి గురించి...పరిచయం...
హైదరాబాద్ కు చెందిన యువ రచయిత్రి తేజస్విని పగడాల ఈ పుస్తకాన్నిరచించారు. ఇది ఆమె రాసిన తొలి పుస్తకం కావడం గమనార్హం. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన తేజస్విని ఎపి సిఎం కార్యాలయంలో కమ్యూనికేషన్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. విధి నిర్వహణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఇంగ్లీష్ ప్రసంగాలను సిద్దం చేశారు. ఈ గ్లోకల్ లీడర్ అనే పుస్తకం రచించేందుకు తాను చాలా గ్రౌండ్ వర్క్ చేశానని, చంద్రబాబు స్వస్థలం నారావారిపల్లి లో సైతం చాలా అధ్యయనం చేశానని చెప్పుకున్నారు. అలాగే సిఎంవోలో పనిచేసేప్పుడు అనేకమంది ఉన్నతాధికారుల నుంచి చంద్రబాబు గురించి తెలుసుకోవడం ద్వారా ఈ పుస్తకంలో ఆయన గొప్పతనాన్ని పొందుపర్చడానికి సహాయపడిందని వివరించారు.."ఇండియాస్ గ్లోకల్ లీడర్" రచయిత్రి తేజస్విని పడగాల.