జీఎస్ఎల్వీ సక్సెస్: క్రూ మాడ్యూల్ని రికవర్ చేసుకున్న ఇస్రో
హైదరాబాద్: అంతరిక్షంలోకి మానవులను పంపే దిశలో భాగంగా వ్యోమగామి మాడ్యూల్ను గురువారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అంతరిక్షం నుంచి వ్యోమగాములు భూమి మీదకు ల్యాండ్ అయ్యే ప్రయోగంలో వారు ప్రయాణించే క్యూ మాడ్యూల్ పారాచూట్ బంగాళాఖాతంలో పడింది.
ఈ పారాచూట్ క్రూ మాడ్యూల్ వేగాన్ని సెకనుకు ఏడు మీటర్లు తగ్గించింది. మొత్తం మీద ప్రయోగించిన 20 నిమిషాలకు కేర్... అండమాన్, నికోబార్ దీవుల్లో చివరి అంచు అయిన ఇందిరా పాయింట్కు 180 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో పడింది.
ప్రత్యేక విమానం ద్వారా విహంగ వీక్షణం చేసి, క్రూ మాడ్యూల్ ని గుర్తించారు. అనంతరం, అండమాన్ నికోబార్ దీవుల్లో సిద్ధంగా ఉంచిన రక్షణ శాఖ నౌకను ఉపయోగించి దాన్ని వెలికితీసి, అదే నౌకలో తమిళనాడులోని ఎన్నూరులో ఉన్న కామరాజన్ పోర్టుకు తరలించారు.
అక్కడి నుంచి తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. మానవులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రోకు కనీసం పదేళ్లు పడుతుంది. మానవరహిత అంతరిక్ష యాత్రకు భారత ప్రభుత్వం ఇంకా అధికారకంగా అనుమతి ఇవ్వలేదు.
జీఎస్ఎల్వీ మార్క్ -3లోని పూర్తిస్ధాయి క్రయోజెనిక్ ఇంజిన్ను తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం జీఎస్ఎల్వీ మార్క్ -3కి సంబంధించి వాతావరణ పనితీరుని పరిశీలించారు. 3,745 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని అంత్యరిక్షంలోకి తీసుకెళ్లింది జీఎస్ఎల్వీ మార్క్ - 3.
జీఎస్ఎల్వీ మార్క్ - 3 రాకెట్ బరువు 630.58 టన్నులు. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగానికి రూ. 155 కోట్ల వ్యయం అయిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంత్యరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్వీ మార్క్ - 3ని ప్రయోగించింది.