లోక్సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియా టూడే సర్వే.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో అధిక సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుందని విశ్లేషించింది. అదే సమయంలో ఆరు సీట్లలో మాత్రం హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. ఇక, ఇండియా టుడే సర్వే ప్రకారం లోక్సభ సీట్ల పైన విశ్లేషణ చూస్తే..
18 స్థానాల్లో వైసీపీ గెలుపు..
ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 18 స్థానాల్లో విజయ సాధిస్తుందని అంచనా వేసింది. అయితే, ఇదే సర్వేలో జనసేనకు ఒక సీటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్న ఇండియా టుడే సర్వే టీడీపీ ఎక్కడ గెలిచేదీ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఆరు సీట్లలో మాత్రం టీడీపీ..వైసీపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉంటుందని విశ్లేషించింది. వైసీపీ గెలిచే స్థానాల్లో తిరుపతి, నెల్లూరు, కడప, రాజంపేట, హిందూపూర్, నరసరావుపేట, నర్సాపురం, ఒంగోలు, బాపట్ల, ఏలూరు, అమలాపురం, కాకినాడ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అరకు, విజయనగరం సీట్లు ఉన్నాయి. అయితే వీటితో హిందూపూర్ టీడీపికి కంచుకోటగా ఉండేది. అక్కడ నుండి తాజా ఎన్నికల్లో పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసీపీ అభ్యర్దిగా పోటీలో ఉన్నారు. అదే విధంగా అరకు, విజయనగరం, అనకాపల్లి , బాపట్ల, అమలాపురం, కర్నూలు, నంద్యాల నుండి కొత్త అభ్యర్దులు వైసీపీ నుండి బరిలో నిలిచారు. వారు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏలూరు సైతం వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేస్తోంది.
ఆరు స్థానాల్లో హోరా హోరీ..
ఏపీలో 18 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని అంచనా వేసిన ఇండియా టుడే ఆరు స్థానాల్లో మాత్రం టీడీపీ.. వైసీపీ మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని విశ్లేషించింది. ఆ సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, చిత్తూరు లోక్సభ స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ నుండి..దువ్వాడ శ్రీను వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. మచిలీపట్నంలో సైతం సిట్టింగ్ ఎంపీ నారాయణ..వైసీపీ నుండి బాలశౌరి పోటీలో ఉన్నారు. విజయవాడ పోటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ టీడీపీ నుండి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని..వైసీపీ నుండి పీవీపి బరిలో నిలిచారు. ఇక, గుంటూరు నుండి సిట్టింగ్ ఎంపి గల్లా జయదేవ్ టీడీపీ నుండి పోటీలో ఉండగా, టీడీపీ నుండి వైసీపీలో చేరిన మోదుగుల వేణుగోపాల రెడ్డి వైసీపీ నుండి బరిలో దిగారు. ఇక, అనంతపురంలో జేసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ టీడీపీ నుండి పోటీలో ఉండగా..వైసీపీ నుండి రంగయ్య పోటీలో నిలిచారు. చిత్తూరులో టీడీపీ సినియర్ ఎంపీ శివ ప్రసాద్ తిరిగి పోటీలో ఉన్నారు. వైసీపీ నుండి కొత్త అభ్యర్ది పోటీలో ఉన్నారు.
జనసేనకు ఒక్క సీటుకు ఛాన్స్...
మొత్తం 25 స్థానాల్లో వైసీపీ 18 స్థానాలు, ఆరు స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉండగా.. మిగిలిన ఒక స్థానంలో జనసేన గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేస్తోంది. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ జనసేన అభ్యర్దిగా విశాఖ నుండి పోటీలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుండి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పోటీ చేసారు. వైసీపీ నుండి సత్యనారాయణ మూర్తి బరిలో ఉన్నారు. అయితే, ఈ సంస్థ అంచనాల మేరకు జనసేన అభ్యర్ది లక్ష్మీనారాయణకు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇక, మరో రెండు రోజుల్లో వాస్తవ ఫలితాలు రానున్న పరిస్థితుల్లో వీటిలో ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి.