ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: కాంగ్రెస్ దోస్తీ బాబుకు దెబ్బ, లోకసభ ఎన్నికల్లో జగన్దే హవా!
అమరావతి/హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటిపై కొన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. అయినప్పటికీ ఎన్డీయేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీ
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కేవలం 15 సీట్లు మాత్రమే తక్కువ పడతాయని ఈ ప్రీపోల్ సర్వేలో తేలింది. లోకసభలో మేజిక్ ఫిగర్ 272. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 257 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 146 సీట్లు వస్తాయని తేలింది. ఎస్పీ, బీఎస్పీలకు మరో నలభై సీట్ల వరకు రానున్నాయి.
ప్రాంతీయ పార్టీలు కూడా
గత ఏడాది (2018) డిసెంబర్ 15వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఈ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, బీజేపీలను మినహాయిస్తే ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఎస్పీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, డీఎంకే, టీఎంసీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్, బిజూ జనతా దళ్, పీడీపీ, టీడీపీ తదితర పార్టీలు ఆయా రాష్ట్రాల్లో సీట్లు గెలుచుకుంటాయని తేలింది.
ఏ కూటమిలో ఎవరంటే?
ఎన్డీయే కూటమిలో బీజేపీ, శివసేన, అకాలీదళ్, జేడీయూ, మిజో నేషనల్ ఫ్రంట్, అప్నా దల్, సిక్కిమ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఎల్జేపీ, ఎన్పీపీ, ఐఎన్ఆర్సీ, పీఎంకే, ఎన్డీపీపీలు ఉన్నాయి. శివసేన వంటి పార్టీలు బీజేపీపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. యూపీఏ కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, డీఎంకే, టీడీపీ, ఎన్సీపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, జేఎంఎం తదితర పార్టీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్, తెరాసలు స్వతంత్రంగా ఉన్నప్పటికీ వారు బీజేపీకి మద్దతుదారులుగా చాలామంది భావిస్తున్నారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?
ఈ సర్వేలో బీజేపీకి 223 సీట్లు, శివసేనకు 8, జేడీయుకు 11, అకాలీదళ్కు 5, ఎల్జేపీకి 3, పీఎంకేకు 1, ఎన్పీపీకి 1, ఏఐఎన్ఆర్సీకి 1, ఎన్పీపీకి 1, ఎస్డీఎఫ్కు 1, అప్నాదల్కు 1, ఎంఎన్ఎఫ్కు 1 వస్తాయని తేలింది. యూపీఏ విషయానికి వస్తే కాంగ్రెస్కు 85, డీఎంకేకు 21, ఆర్జేడీకి 10, ఎన్సీపీకి 9, జేఎంఎంకు 4, జేడీఎస్కు 4, ఆర్ఎల్డీకి 2, ఆర్ఎల్ఎస్పీకి 1, ఆర్ఎస్పీకి 1, టీడీపీకి 4, నేషనల్ కాన్ఫరెన్స్కు 2 వస్తాయని తేలింది.
చంద్రబాబుకు వైసీపీ దెబ్బ
ఏపీలోను ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఈ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19, అధికార తెలుగుదేశం పార్టీకి 4, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 16, మజ్లిస్ పార్టీకి 1 సీటు వస్తుందని తేలింది. ఈ ఫలితాలు తెలంగాణలో తెరాసకు అత్యంత సంతోషించే అంశం. ఏపీలో వైసీపీ బాగా పుంజుకున్నట్లుగా ఈ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీతో కలిసిన చంద్రబాబుకు ఏపీలో పెద్ద షాక్ తగులుతుందని భావిస్తున్నారు.