తిరుమల కార్చిచ్చు: నీటి యుద్ధంతో అదుపు (పిక్చర్స్)
చిత్తూరు/హైదరాబాద్: ఏడుకొండలపై చెలరేగిన దావానలాన్ని చల్లార్చేందుకు చేపట్టిన ఆపరేషన్ శేషాచలం విజయవంతమైంది. గురువారం రాత్రి తిరుమల అన్నమయ్య భవనంలో అటవీ, రక్షణ శాఖల ఉన్నతాధికారుల సమావేశం అనంతరం కేంద్ర అటవీ శాఖ సంచాలకుడు, ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ గార్బ్యాల్, టిటిడి ఈవో గోపాల్ ఈ మేరకు ప్రకటించారు.
కేంద్ర అటవీ, రక్షణ శాఖల సంయుక్త సహకారంతో కార్చిచ్చును అదుపులోకి తీసుకురాగలిగామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వీరితో పాటు ప్రిన్సిపల్ చవచవఎఫ్ సోమశేఖర్ రెడ్డి, కేంద్ర అగ్నిమాపక సలహాదారు డికె షమ్మీ, ఫైర్ డిజి సాంబశివరాలు తదితరులు పాల్గొన్నారు.
శేషాచలం అడవుల్లో మంగళవారం మొదలైన మంటలు బుధవారానికి ఉధృతంగా మారడంతో, వాటిని ఆర్పేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగు హెలికాప్టర్లతో కేంద్ర రక్షణ శాఖ గురువారం రంగంలోకి దిగింది. వాటిలో రెండు హెలికాప్టర్లు ఏరియల్ సర్వే చేస్తూ సందేశాలు అందిస్తుంటే.. నీటి తొట్టెలు (బాంబీ బకెట్లు) ఉన్న మరో రెండు హెలికాప్టర్లు వాటిని అనుసరిస్తూ మంటలపై నీటిని కుమ్మరించాయి.
నీటి యుద్ధం
హెలికాప్టర్లలో ఒకదానిలో టిటిడి సివిఎస్వో శ్రీనివాస్, ఎస్ఈ రమేష్ రెడ్డి, పైలట్లతో వెళుతూ దారిచూపించగా మరో హెలికాప్టర్కు బాంబీ బకెట్ అమర్చారు. కుమారధార, పసుపుధార జలాశయం నుంచి బెలూన్ నిండా 3 వేల లీటర్ల నీటిని నింపుకొని తొలుతగా పొగలు, మంటలు వస్తున్న ప్రాంతంలో నీటిని చిమ్మారు.
నీటి యుద్ధం
కొంతసేపటికి తుంబురుతీర్థం ప్రాంతంలో మంటలు ఎక్కువగా వ్యాపిస్తుండడంతో దిశ మార్చుకుని మరోసారి జలాశయంలో నీటిని నింపుకొని అక్కడ మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.
నీటి యుద్ధం
ఇలా గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఒక్కో హెలికాప్టర్ ద్వారా 15 విడతలకుపైగా నీటిని మంటలపై కుమ్మరించారు. గురువారం రాత్రి సమయానికి.. పాపవినాశం సమీపంలో 200 అడుగుల వెడల్పుతో 2 కిలోమీటర్ల పొడవున అగ్ని కీలలు విస్తరించి ఉన్నాయి.
నీటి యుద్ధం
వీటిని అదుపులోకి తేవడంతో పాటు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో నీటిని కుమ్మరించడం ద్వారా ప్రమాదాలను ముందస్తుగా నివారించే పనిలో హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి.
నీటి యుద్ధం
కాగా కార్చిచ్చును ఆర్పేందుకు హెలికాప్టర్లను వినియోగించడం భారతదేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని చెబుతున్నారు. మరోవైపు వివిధ బలగాలు అగ్నిమాపక యంత్రాల సాయంతో ఉదయం కాకులకొండ ప్రాంతంలో మంటలు ప్రబలకుండా అదుపుచేస్తూ వచ్చాయి. కాకులకొండ పక్కనున్న లోయలోని చివర్లో మంటలు చెలరేగాయి.
నీటి యుద్ధం
ఇది దట్టమైన అటవీ ప్రాంతమైనందున మంటలను అదుపుచేయడానికి సిబ్బందికి సాధ్యపడలేదు. ఈ మంటలు టిఎన్ పాళెం వరకు వ్యాపించాయి. దీంతో హెలికాప్టర్ సాయంతో ఈ మంటలను అదుపుచేశారు.
నీటి యుద్ధం
పాపవినాశనం లోయ, తుంబురుతీర్థం మధ్య రెండు కిలోమీటర్ల పరిధిలో మంటలు కొద్దిగా ఉన్నాయి. హెలికాప్టర్ల సహాయంతో మంటలను అదుపుచేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
నీటి యుద్ధం
మొత్తమ్మీద యుద్ధప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యల్లో 1500 మంది శ్రమించారు. శేషాచల అడవుల్లో మంటలను ఆర్పే ఆపరేషన్ మరో రెండు రోజులు కొనసాగనుంది.
నీటి యుద్ధం
ఆపరేషన్ పూర్తి చేశాకే హెలికాప్టర్లు తిరిగి వెళ్లనున్నాయి. ఒకవేళ శుక్రవారం మంటలు అదుపు కాకుంటే మరో రోజు కూడా కొనసాగించే అవకాశాలున్నాయి.
నీటి యుద్ధం
ఎన్నికల సంఘం అనుమతితో టిటిడి ఫారెస్ట్, అటవీ శాఖలలోని ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు సత్వర చర్యలు చేపడతామని ప్రిన్సిపల్ సిసిఎఫ్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు.
నీటి యుద్ధం
అగ్ని ప్రమాదంలో దగ్ధమైన కాకులకొండ ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ గోపాల్, సభ్యులు శివప్రసాద్, రవీంద్ర, కన్నయ్య, వెంకటరమణ, అధికారులు గురువారం పర్యటించారు.
నీటి యుద్ధం
ఈ సందర్భంగా బాపిరాజు మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్దస్థాయిలో శేషాచల అటవీ సంపద కాలిపోవడం ఇదే తొలిసారన్నారు. టిటిడికి చివరగా అందిన సమాచారం మేరకు దాదాపు 460 హెక్టార్లలో అటవీ ప్రాంతం అగ్నికీలలకు ఆహుతైనట్లు చెప్పారు.