గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో 8మంది విశాఖవాసులు
విశాఖ: గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్-32లో ఎనిమిది మంది విశాఖపట్నంకు చెందిన వారు ఉన్నారు. ఇది వారి కుటుంబ సభ్యులను షాక్కు గురి చేసింది. చెన్నైలోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తుండగా శుక్రవారం ఉదయం విమానం గల్లంతైన విషయం తెలిసిందే.
ఈ విమానంలో 29 మంది ఉన్నారు. ఈ గల్లంతైన ఇరవై తొమ్మిది మందిలో 8 మంది తెలుగు వారు ఉన్నారు. వీరు ఎన్ఏడి సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు.
గల్లంతైన విశాఖ వాసుల్లో ఎన్ఏడీలో చార్జ్మెన్ సాంబమూర్తి, ఫిట్టర్స్ ప్రసాద్ బాబు, సేనాపతి, నాగేంద్ర రావు, మహారాణా, చిన్నారావు, చిట్టిబాబు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది శ్రీనివాస రావు ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
గల్లంతైన విమానం: ఏఎన్-32 ప్లేన్ ప్రత్యేకతలు ఇవే
కొనసాగుతున్న గాలింపు
చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టు బ్లెయిర్కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన విమానం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. 29 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఎన్-32 విమానం అదృశ్యమైనట్లు వైమానిక దళం అధికారులు వెల్లడించారు.
విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపులో జలాంతర్గామి, 13 యుద్ధ నౌకలు, 5 యుద్ద విమానాలు పాల్గొన్నాయి. విమానంలో బేకన్ లొకేటర్ ఉందని, అది కూలిపోయినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం పంపుతుందని అధికారులు చెబుతున్నారు.
29 మందితో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
ఉదయం 7.30 గంటలకు తాంబరం ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన విమానానికి ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందా, లేదా దారి మళ్లిందా అన్న కోణంలో వైమానిక దళ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రష్యాకు చెందిన ఏఎన్-32 రకం విమానాలను భారతీయ వాయుసేన 1984 నుంచి ఉపయోగిస్తోంది. ఈ రకానికి చెందిన 125 విమానాలను వాయుసేన ఉపయోగిస్తోంది. ఇవి ఎలాంటి వాతావరణ మార్పులు తలెత్తినా, రీఫ్యుయెలింగ్ చేయకపోయినా నాలుగు గంటల వరకు ప్రయాణిస్తాయి. ఇవి చాలా ధృడంగా ఉంటాయని, అందువల్ల వీటిని ఎక్కువగా కొండ ప్రాంతాలకు, ఎడారులకు పంపించేందుకు వాడుతుంటారని చెబుతున్నారు.