ఏపీ హైకోర్టు సీజేపై ఆరోపణలు .. రాజకీయ దురుద్దేశమే : భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అనవసరమైన, అవాస్తవిక మైన అంశాలతో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. న్యాయ వ్యవస్థను అవమాన పరచాలని దురాలోచనతో కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. హన్సరాజ్ అనే తెలంగాణ కు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి అర్థంలేని ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరమని, కేవలం దురాలోచనతోనే, రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాన న్యాయమూర్తి పై ఆరోపణలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి, ఏపీ హైకోర్టు విషయంలో ఏం పని అంటూ, అసలు ఏపీ హైకోర్టు లో ఏం జరుగుతుందో అర్థమై ఉండదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వార్త రాసిన పత్రిక పై కూడా నిప్పులు చెరిగారు ముప్పాళ్ళ సుబ్బారావు. న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయదని, అది గమనించి మెలగాలని ఆయన హితవు పలికారు. అంతేకాదు ఇటీవల కాలంలో రాజకీయ దురుద్దేశంతో న్యాయవ్యవస్థ మీద కూడా దాడికి దిగారని విమర్శించారు.
అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 16 జడ్జిమెంట్లు వ్యతిరేకంగా ఇవ్వడం వల్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ప్రజలు దీన్ని గమనించాలని ముప్పాళ్ళ సుబ్బారావు కోరారు. ఇటువంటి ఆరోపణలు చేయటం వల్ల సానుకూల తీర్పులు వస్తాయని దురాలోచనతో కుట్రలు చేస్తే తప్పు అని ఆయన పేర్కొన్నారు.
వాస్తవాలను వక్రీకరిస్తూ కరోనా కేసులు నమోదు అవ్వడానికి ప్రధాన న్యాయమూర్తి కారణమనడం మంచిది కాదని పేర్కొన్నారు. వాస్తవాలను మభ్యపెట్టి ప్రధాన న్యాయమూర్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ లబ్ధి పొందుతున్న కొందరి పాత్ర ఉందని ఆయన మండిపడ్డారు. భారత న్యాయవాదుల సంఘం ఇలాంటి వ్యాఖ్యలను,ప్రధాన న్యాయమూర్తి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తుంది అని ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు పేర్కొన్నారు.