బుల్లెట్ తగిలి నేవీ ఆఫీసర్ మృతి: ఆత్మహత్యగా అనుమానం?
విశాఖపట్నం: విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. నేవల్ డాక్యార్డ్లోని ఐఎన్ఎస్ కుతార్ యుద్ధనౌకలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో నేవీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే... హర్యానాకు చెందిన తేజ్వీర్సింగ్ (25) తూర్పు నౌకాదళంలో సబ్ లెఫ్టినెంట్ కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఆయన విధులు నిర్వహించే యుద్ధనౌక ఇంజన్ రూమ్ నుంచి ఒక్కసారిగా తుపాకి పేలిన శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న సహచర ఉద్యోగులకు రక్తపు మడుగులో పడి ఉన్న తేజ్వీర్ కనిపించారు. హుటాహుటిన ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. తేజ్వీర్సింగ్ మృతిపై నేవీ అధికారులు విచారణ జరుపుతున్నారు. తేజ్వీర్ కణత నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా హర్యానాకు చెందిన తేజ్వీర్ ఓ అనాథ. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో ఉండి చదువుకుని నేవీలో చేరారు. ఇదిలా ఉంటే ఐఎన్ఎస్ సింధు ఘోష్లో జరిగిన మరో ప్రమాదంలో ఓ సెయిలర్ మృతి చెందారు. నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.