వైఎస్ జగన్ సర్కారుకు ఊరట: ‘మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్’పై ఇండియన్ నేవీ క్లారిటీ
అమరావతి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, వార్తలపై తూర్పు నావల్ కమాండ్(ఈఎన్సీ) ఖండించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేవీ అధికారులు షాకిచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ సర్కారు నుంచి ప్రతిపాదన రాలేదంటూ..
ఆ వార్తలను, కథనాలను నేవీ కొట్టిపారేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ శనివరాం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, దీనిపై అభ్యంతరాలు కూడా చెప్పలేదని స్పష్టం చేసింది.
మీడియాలో వచ్చిన కథనాలో నేపథ్యంలోనే..
కాగా, శనివారం పలు మీడియా సంస్థలో వెలువడిన కథనాలు రావడంతో ఈ మేరకు వివరణ ఇస్తున్నట్లు తెలిపింది. మిలీనియం టవర్స్లో రాజధాని ఏర్పాటు చేయొద్దని నేవీ అధికారులు ప్రభుత్వానికి చెప్పారని టీడీపీ నాయకులు శనివారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
బోండా ఉమా సంచలన ఆరోపణలు..
సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మిలీనియం టవర్స్కు సమీపంలోనే దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగ ఉండటమే ఇందుకు కారణమని టీడీపీ నేత, మాజీ మంత్రి బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. నేవీ అధికారులు అభ్యంతరం తెలపడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారని అన్నారు. ఇదే అంశాన్ని ఓ ఇంగ్లీష్ పత్రిక సైతం ప్రచురించిందని తెలిపారు.
నేవీ దెబ్బకు సర్కారు మౌనం అంటూ..
నేవీ దెబ్బకు ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందన్నారు. విశాఖ రాజధాని అని హడావిడి చేశారు.. ఇప్పుడేమంటారు? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమాతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఇదే విధంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే నేవీ అధికారులు, కేంద్ర రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్లయింది.