మెరిసిన తెలుగు తేజం: చెన్నుపాటి జగదీశ్కు ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు తమ సత్తాను చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సత్య నాదెళ్ల ఏకంగా సాప్ట్వేర్ రంగాన్ని శాసించే మైక్రోసాప్ట్కు సీఈఓగా నియమితులై సత్తా చాటగా, తాజాగా భౌతిక శాస్త్రవేత్త, అధ్యాపకుడిగానూ విశేష సేవలందిస్తున్న చెన్నుపాటి జగదీశ్కు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా'తో సత్కరించింది.
కృష్ణా జిల్లా మారుమూల గ్రామం వెల్లూరిపాలెంలో జన్మించిన చెన్నుపాటి జగదీశ్ 1977లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వర్సిటీలో 1986లో పీహెచ్డీ పూర్తి చేసిన ఆయన కొంతకాలం పాటు కెనడాలో అధ్యాపకుడిగా పనిచేశారు.
అనంతరం 1990లో ఆస్టేలియా వెళ్లారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్యూ)లో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం యూనివర్సిటీలోని సెమీ కండక్టర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ విభాగాలకు అధిపతిగానే కాక ఆస్ట్రేలియన్ నేషనల్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీకి డైరెక్టర్ గానూ కొనసాగుతున్నారు.
ఫిజిక్స్, ఇంజనీరింగ్ విభాగంలో చెన్నుపాటి జగదీశ్ అందించిన విశేష సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను తన అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా'కు ఎంపిక చేసింది. మంగళవారం (జనవరి 26)నాడు ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెల్బోర్న్లో జరిగిన ఓ కార్యక్రమంలో జగదీశ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా చెన్నుపాటి జగదీశ్ మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్యూ)లో సెమీ కండక్టర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ రంగాలపై గత 25 ఏళ్లుగా తాను సేవలందిస్తున్నానని తెలిపారు.
నానో టెక్నాలజీ రంగంలో పరిశోధన చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అందిస్తోన్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో తన ఎదుగుదలకు ఇద్దరు హైస్కూల్ టీచర్లు సహకరించారని, వారి సహకారం లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడని కాదన్నారు. కాగా, ప్రొఫెసర్ జగదీశ్ భార్య కూడా గతేడాది డిసెంబర్లో ఫిజిక్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసే విద్యార్దుల కోసం ఎండోమెంట్ ఫండ్ను ఏర్పాటు చేశారు.