నేడే రోదసిలోకి తెలుగు అమ్మాయి శిరీష బండ్ల: 90 నిమిషాల ప్రయాణం, ఆసక్తికర అంశాలు
న్యూయార్క్: అంతరిక్షంలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధం సిద్ధమైంది. మన తెలుగు అమ్మాయి తొలిసారి రోదసిలోకి ఆదివారం(జులై 11న) ప్రవేశించబోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల ఈ ఘనతను సాధించనున్నారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత రోదసియానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష రికార్డుల్లోకి ఎక్కనున్నారు.

రోదసిలోకి 34 ఏళ్ల శిరీష బండ్ల
ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనోక వీఎస్ఎస్ యూనిటీ-22ను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళుతుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి రాకెట్ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళుతుంది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్తోపాటు మరో ఐదుగురు రోదసిలోకి వెళుతుండగా, వారిలో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు.

వ్యోమనౌకలో శిరీష కీలక బాధ్యతలు
నాలుగో వ్యోమగామిగా ఉన్న శిరీష వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహిస్తారు. ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

గుంటూరుకు చెందిన శిరీష బండ్ల..
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించిన శిరీష బండ్ల తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్లో స్థిరపడ్డారు. పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానకి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

రోదసిలోకి వెళ్లడంపై శిరీష స్పందన
వర్జిన్ గెలాక్టిక్కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా ఆదివారం రోదసిలోకి వెళ్లనుండటం తనకెంతో గర్వంగా ఉందని శిరీష ట్వీట్ చేశారు. అంతరిక్ష యానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కంపెనీలో, యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావడాన్ని అత్యంత అదృష్టంగా భావిస్తున్నట్లు శిరీష తెలిపారు
ఆదివారం రోదసిలోకి.. 90 నిమిషాల ప్రయాణం..
కాగా, ఈ యాత్రలో అందరూ సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వర్జిన్ గెలాక్టిక్ ముఖ్య వ్యోమగామి శిక్షకురాలు బెత్ మోసెస్ది, ఇక వ్యోమనౌకలోని క్యాబిన్ పనితీరును పరిశీలించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఆధునీకీకరణలను గుర్తించే బాధ్యత ముఖ్య ఆపరేషన్స్ ఇంజినీర్ కాలిన్ బెనెట్ది. వీరితోపాటు ఈ యాత్రలో ముఖ్య పైలట్ డేవ్
మెక్కే, పైలట్ మైఖేల్ మాసుకీ కీలకంగా వ్యవహరించనున్నారు. కాగా, టికెట్ కొనుక్కుని యాత్ర చేస్తున్న ప్రయాణికుడిలా వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ వ్యవహరించనున్నారు. న్యూమెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన స్పేస్ పోర్టు అమెరికా నుంచి ఆదివారం మొదలయ్యే అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగనుంది.