కాలేజీ కంప్యూటర్లలో వైరస్ ఎక్కించాడట: చిత్తూరు కుర్రాడికి అమెరికాలో జైలు..కళ్లు తిరిగే జరిమానా!
చిత్తూరు: ఉన్నత విద్యాభ్యాసం కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడొకరు తుంటరి పని చేశాడు. దీని ఫలితం- ఆయన కేరీర్ నాశనమైంది. ఆ విద్యార్థి చేసిన పనికి ఏడాది కారాగార శిక్షను అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా- 58, 471 డాలర్ల జరిమానాను చెల్లించాల్సి వస్తోంది. మనదేశ కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ 41 లక్షల రూపాయల పైమాటే. ఆ యువకుడి పేరు విశ్వనాథ్ ఆకుతోట.
న్యూయార్క్ సమీపంలోని అల్బానీలో గల సెయింట్ రోజ్ కాలేజీలో చేరాడు. మధ్యలో ఆయనకు ఏ దుర్బుద్ధి పుట్టిందో గానీ.. ఓ వైరస్ ను కాలేజీ కంప్యూటర్లలోకి ఎక్కించారు. యూఎస్బీ కిల్లర్ పేరుతో ఈ వైరస్ ను కాలేజీకి చెందిన 66 కంప్యూటర్లలో ప్రవేశపెట్టారు. ఈ వైరస్ ను కంప్యూటర్లోని యూఎస్బీ పోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే దాని ప్రభావం ఛార్జింగ్ కెపాసిటర్లపై తీవ్రంగా పడుతుందట.
కెపాసిటర్లు అతి వేగంగా ఛార్జ్ కావడం, ఆ వెంటనే డిశ్చార్జ్ కావడం దీని లక్షణమని తేలింది. దాని వల్ల యూఎస్బీ పోర్టు, కంప్యూటర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్థ ఓవర్ లోడ్ కు గురై పాడవుతాయి. విశ్వనాథ్ ప్రవేశపెట్టిన యుఎస్బీ కిల్లర్ దెబ్బకు ఆయా కంప్యూటర్లన్నీ పాడైపోయాయి. ఎందుకూ కొరగాకుండా పోయాయి. దీనికి ప్రధాన కారకుడు విశ్వనాథేనని గుర్తించింది కాలేజీ యాజమాన్యం. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన చోటు చేసుకుంది. పోలీసులు ఆయనను అదేనెల 22వ తేదీన నార్త్ కరోలినాలో అరెస్టు చేశారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా.. విశ్వనాథ్ తన నేరాన్ని అంగీకరించాడు. దీనితో- అతనికి శిక్షను ఖరారు చేస్తూ అల్బానీ న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏడాది కారాగార శిక్షతో పాటు 41 రూపాయల జరిమానా విధించినట్లు అమెరికా అటార్నీ జనరల్ సీ జాక్విట్ తెలిపారు.