గాల్లో చక్కర్లు కొట్టిన ప్లేన్: అదే విమానంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ
విజయవాడ: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షాలతోపాటు గాలులు కూడా బలంగా వీచాయి. దీంతో ఓ విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించక గాల్లోనే చక్కర్లు కొట్టింది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం.. ఇక్కడ వాతావరణ పరిస్థితిలు అనుకూలించకపోవడంతో ల్యాండ్ కాలేదు. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేయకుండా గాల్లోని కాసేపు చక్కర్లు కొట్టించారు.
కాగా, ఈ విమానంలో పలువురు ప్రయాణికులతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే, కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఈ విమానం.. వాతావరణం పరిస్థితులు సానుకూలంగా మారడంతో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు.
ఏమవుతుందోనని ఆందోళన చెందిన విమానాశ్రయంలోని ప్రయాణికులు విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా, మంగళవారం ఉదయం నుంచీ కూడా కృష్ణా జిల్లాలో భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి.