టీడీపీ నేతలపై దాడులు సరి కాదు .. వ్యక్తిగతంగా జగన్ కు సహకరిస్తా ..టీడీపీ మాజీమంత్రి డొక్కా
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని,ఇలా దాడులకు పాల్పడటం సమంజసం కాదని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచలు ఇస్తామని తెలిపారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఓటమిపై స్పందిస్తూ తాటికొండనుండి పోటీ చేస్తే గెలిచే వాడినని పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చెయ్యటం తనకు ఇష్టం లేదని చివరి నిముషంలో టికెట్ ఖరారు చెయ్యటంతో అన్ని ప్రాంతాలు తిరగలేకపోయానని ఆయన తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తే తాను సహకరిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని తెలిపారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని, చంద్రబాబు పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామనిఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన టీడీపీ నేతలు నిరాశ చెందొద్దన్నారు. ఇక వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఇలా టీడీపీ నేతలపై దాడులు చెయ్యటం సరికాదని డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. ఈ తరహాదాడులు జరగకుండా ప్రభుత్వం యంత్రాంగం పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.