డామిట్.. కథ అడ్డం తిరిగింది! బెడిసికొట్టిన మంత్రి అఖిలప్రియ వర్గం యత్నం!!
నంద్యాలలో మంత్రి భూమా అఖిలప్రియ వర్గం ప్రయత్నం బెడిసికొట్టింది. పొన్నాపురంలో కేసీ కెనాల్ పాత భవనాన్ని కూల్చి ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలనే యత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు.
నంద్యాల: పొన్నాపురంలో ఇళ్ల మధ్య, పంచాయతీ అనుమతి లేకుండా కేసీ కెనాల్ పాత భవనాన్ని కూల్చి ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలనే మంత్రి భూమా అఖిలప్రియ వర్గం ప్రయత్నం బెడిసికొట్టింది.
మంత్రి అఖిలప్రియతో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేయించాలని ఆమె వర్గీయులు యత్నించగా సోమవారం స్థానికులు, కేసీ కెనాల్ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో మంత్రి అఖిలప్రియ నంద్యాలపై దృష్టి పెట్టి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రారంభోత్సవాలు, భూమి పూజలకు శ్రీకారం చుట్టారు.
ఇటీవల బైపాస్ రోడ్డు ప్రారంభం, నాబార్డు నిధుల కింద మంజూరైన అబాండంతాండ-పెద్దకొట్టాల-అయ్యలూరు మెట్ట వరకు నిర్మించే బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ సోదరుడికి పొన్నాపురంలో రూ.13 కోట్లతో 33/11 కేవీ సామర్థ్యం గల ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సబ్ కాంట్రాక్ట్ దక్కింది. ఉప ఎన్నిక దృష్ట్యా మంత్రి అఖిలప్రియతో ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేయించాలని యత్నించి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణపై ఈ నేత ఒత్తిడి తెచ్చారు.
స్థానికుల్లో వ్యతిరేకత...
పొన్నాపురంలోని ప్రభుత్వ స్థలంలో లస్కర్ల కోసం కేసీ కెనాల్ అధికారులు గదులను నిర్మించారు. ఈ గదులు శిథిలావస్థకు చేరినందున గ్రామ సచివాలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పంచాయతీ చేసిన తీర్మానం పెండింగ్లో ఉంది.
అయితే, రెవెన్యూ అధికారులు దీనికి అనుమతి ఇవ్వకుండా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. రెవెన్యూ అధికారుల మౌఖికి ఆదేశాలతో కేసీ కెనాల్ గదులను ప్రొక్లైన్తో కూల్చడానికి వెళ్లిన ట్రాన్స్కో అధికారులను కేసీ కెనాల్ అధికారులు, స్థానికులు అడ్డుకున్నారు.
దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు కేసీ కెనాల్ పాత భవన కూల్చివేత పనులు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. స్థానికులు మాత్రం అందరికీ అనుకూలంగా, ఎలాంటి వివాదం లేని స్థలంలో ఇండోర్ సబ్స్టేషన్ను నిర్మించాలని కోరుతున్నారు.