చేతకాక, పత్రికలకి బెదిరింపు:కేసీఆర్ని ఏకేసిన ఇంద్రసేన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి గురువారం మండిపడ్డారు. కేసీఆర్ ప్రతి దానిని రాజకీయం చేస్తూ ఇతర పార్టీల పైన బురద జల్లుతున్నారన్నారు. ఒక్కరోజులో సర్వే అంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ నెల 19వ అందుబాటులో లేకుంటే వారు తెలంగాణవారు కాకుండా పోతారా అని ప్రశ్నించారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఎనిమిది గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించిందని, ఇప్పుడేమో చేతులెత్తేసిందని విమర్శించారు.
మూడేళ్ల తర్వాత 24 గంటల విద్యుత్ అని ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పరిశ్రమలకు కూడా అప్రకటిత కోతలు విధిస్తున్నారన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో విద్యుత్ లేక శస్త్ర చికిత్సలు ఆగిపోతున్నాయన్నారు. వార్తలు రాస్తే పత్రికలను కూడా బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వం తన చేతకానితనాన్ని కేంద్రం పైన మోపుతోందన్నారు. కేసీఆర్ అహంకార ధోరణి వల్ల ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు.
వృథా అయిన విద్యార్థుల సమయం ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గడ్డ మీదకు వెళ్లే ధైర్యం కేసీఆర్కు ఉందా అని సవాల్ చేశారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని, విద్యార్థులు, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణ తిరగబడుతోందన్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ లాఠీఛార్జ్ చేయిస్తున్నారని కిషన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. ప్రసంగాలతో కేసీఆర్ ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరన్నారు.
బీజేపీపై డిప్యూటీ సీఎం అలీ ఆగ్రహం
గోల్కొండ కోటలో జెండా ఎగురవేయడాన్ని తప్పు పడుతున్న బీజేపీ పైన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. ప్రచారం కోసమే బీజేపీ విమర్శలు చేస్తోందన్నారు. ఎర్రకోట పైన జెండా ఎగురవేసినప్పుడు, గోల్కొండ కోట పైన ఎగురవేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.