జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీజేపీ నేత రఘురాజు
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నేత ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.
గాంధీ జయంతి రోజు నుంచే నిరుద్యోగ భృతి అమలు: చంద్రబాబు, ఎంతంటే?
పార్టీ కండువా కప్పి రఘురాజును వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారు. రఘురాజుతోపాటు 500మంది నేతలు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు శృంగవరపుకోట నుంచి 500 ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా వీరంతా పెందుర్తికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ ప్రభంజనం సృష్టిస్తారని అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
ఎస్ కోట నియోజకవర్గంలో గెలిచి జగన్కు కానుకగా ఇస్తామని చెప్పారు. కాగా, విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, కళా ఆస్పత్రి అధినేత పైడి వెంకట రమణమూర్తి, పలువురు వైశ్యులు కూడా బుధవారం వైసీపీలో చేరారు.