ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి చెందారు.
ఇటీవల శ్రీకాంత్ రెడ్డికి కరోనా సోకడంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడే ఈ పారిశ్రామికవేత్త పాలం శ్రీకాంత్ రెడ్డి.
గతంలో శ్రీకాంత్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. ఆయన మోడర్న్ రాయలసీమ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అత్యధిక కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా ఏపీలో 9597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా, ఏపీలో 93 మంది మరణించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,54,146 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 90,425 యాక్టివ్ కేసులున్నాయి. 1,61,425 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2296కు చేరింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 84,544 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 22,596 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 61,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 654 మంది కరోనా బారినపడి మరణించారు. తాజాగా, 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1920 మంది కోలుకున్నారు. 9 మంది మరణించారు.