రోజు రోజుకీ ఉబ్బిపోతున్న పసివాడి పొట్ట! చివరికి ఏమవుతుందో?
ఆ పసివాడి వయసు ఆరు నెలలు. అయితే మూడో నెల నుంచే అతడి పొట్ట పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పొట్ట పరిమాణం 28 సెంటీమీటర్లకు చేరుకుంది. అలా ఎందుకు జరుగుతోందో తెలియక అతడి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
విశాఖపట్నం: ఆ పసివాడి వయసు ఆరు నెలలు. అంత చిన్న వయసులోనే మాయదారి వ్యాధి ఒకటి పట్టి పీడిస్తోంది. అతడి పొట్ట రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
విశాఖపట్నం జిల్లా పాడేరులోని మారుమూల గ్రామమైన కుంకంపూడికి చెందిన గెమ్మెలి బాలరాజు, లక్ష్మి దంపతులకు ఆరు నెలల కిందట మగబిడ్డ జన్మించాడు. అయితే మూడు నెలలుగా ఆ బాలుడి పొట్ట ఉబ్బిపోతూ వస్తోంది. ప్రస్తుతం ఈ పసివాడి పొట్ట 28 సెంటీమీటర్లకు పెరిగిపోయింది.
ఆ బాలుడు పాలు తాగినా, తాగకపోయినా ఇదే పరిస్థితి. అసలే కడు పేదరికంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే, ఈ మాయదారి రోగమొకటి. ప్రస్తుతం తమ బిడ్డకు వైద్యం చేయించే స్తోమత కూడా లేక ఆ దంపతులు తల్లడిల్లిపోతున్నారు.
ఇటీవల తమ కుమారుడిని చింతపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లామని, అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తమ బాబును తరలించారని,ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని ఆ పసివాడి తల్లదండ్రులు బాలరాజు, లక్ష్మి తెలిపారు.
అయితే, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రెండు రోజులపాటు చిన్నారిని ఉంచి, ఆ తరువాత వైద్య సిబ్బంది పట్టించుకోలేదని, దీంతో ఏ చేయాలో అర్థం కాక తమ బాబుని ఇంటికి తీసుకొచ్చేసుకున్నామని వారు వాపోయారు.